ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం జగన్ తెరపైకి తెచ్చిన మావిగన్ చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో… అమరావతిపై ప్రభుత్వం నుంచి వివరణ ఇచ్చేందుకు మైకుల ముందుకు వచ్చిన మంత్రి నారాయణ.. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు.
అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, సుమారు రెండు దశాబ్ధాల సమయం అవసరమని చెబుతోందని వైసీపీ నేతలు విమర్శిస్తోన్న వేళ దీనిపైనా వివరణ ఇచ్చారు.
ఇందులో భాగంగా… అమరావతి నిర్మాణం జరిగితే ఎకరా రూ.20 కోట్లు అవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. ఇదే సమయంలో… హైదరాబాద్ సెక్రటేరియట్ నిర్మాణానికి రూ.615 కోట్లకు టెండర్లు ఇచ్చి రూ.1,423 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.
పార్లమెంటులో రూ.862 కోట్లకు టెండర్లు పిలిచి రూ.1,172 కోట్లు ఖర్చు చేశారని, చదరపు అడుగుకు రూ.16,900 ఖర్చు చేశారని పేర్కొన్నారు. మావిగన్ అనేది సీఆర్డీఏ పరిధిలో ఎప్పుడో ఉందని చెబుతున్నారు.
దీంతో… వీటిపై ఆర్థిక పరమైన ప్రశ్నలు, స్పష్టతలు ఇస్తూ వైసీపీ నేతలు వరుసగా మీడియా ముందుకు వస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై వివరణ ఇవ్వగా తాజాగా పేర్ని నానితో పాటు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. పేర్ని పంచులు, బుగ్గన ప్రశ్నలు వెరసి… మాగివన్ పై వైసీపీ బలమైన వాయిస్ ని వినిపించే ప్రయత్నం చేసిందనే మాటలు వినిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా తొలుత అమరావతి, రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడులు, ఖర్చులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి విషయాలపై సీఎం చంద్రబాబుకు బుగ్గన రాజేంద్రనాథ్ పలు ప్రశ్నలు సంధించారు.
- అమరావతి గురించి పదే పదే మాట్లాడుతున్న చంద్రబాబు.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల గురించి ఏనాడైనా మాట్లాడారా..?
- మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం వద్ద రూ.5 వేల కోట్లు కూడా లేవని అంటూ.. అమరావతిలో మాత్రం లక్షల కోట్లు పెట్టాలంటారా..?
- అమరావతికి లక్షల కోట్లు అవసరమైతే.. మావిగన్ కు కేవలం రూ. 10-20 వేల కోట్లు చాలంటే అర్ధం చేసుకోలేకపోతున్నారా..?
- కేంద్రం 2014 ఏప్రిల్ 25న శివరామకృష్ణన్ కమిటీ వేస్తే.. ఇప్పుడు ఉన్న అమరావతి ప్రాంతం రాజధానికి పనికి రాదని ఆ కమిటీ చెప్పిన విషయం గుర్తులేదా..?
- డిజైన్లకే 400 కోట్లతో మొదలుపెట్టి అమరావతిలో జరుగుతున్న అవినీతి చూసి దేవుళ్లు కూడా భయపడతారు కదా చంద్రబాబు..?
..అంటూ బుగ్గన రాజేంద్రనాథ్.. కూటమి ప్రభుత్వాధినేతకు కీలక ప్రశ్నలు సంధించారు. పార్టీలకు అతీతంగా ఆలోచిస్తే… ఈ ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కచ్చితంగా సమాధానాలు రావాలి. అది బుగ్గనకు కాకపోయినా, వైసీపీకి చెప్పకపోయినా.. ప్రజలకు కచ్చితంగా చెప్పాల్సిన అవసరం కచ్చితంగా ఉంది.
ఇదే క్రమంలో… అమరావతిపై కూటమి నేతల వెర్షన్ కు, నారాయణ వివరణకు స్పందించిన మంత్రి పేర్ని నాని సైతం మావిగన్ పై స్పష్టత ఇస్తూ, అమరావతిపై పలు ప్రశ్నలు సంధించారు.
- మావిగన్ అనేది సీఆర్డీఏ పరిధిలో ఎప్పుడో ఉందని 2014 డిసెంబర్ 30 నాటి జీవో చూపిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. ఈ ఎనిమిదేళ్లలో ఈ ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్ ఎందుకు సిద్ధం చేయలేదు? అనేది పేర్ని నాని సంధించిన తొలి ప్రశ్నగా ఉంది.
- అమరావతికి రూ.51 వేల కోట్లకు టెండర్లు పిలిచామని చెప్పే మంత్రి నారాయణ.. అందులో ఒక్క కోటి రూపాయలైనా అమరావతిలోని 29 ఊర్లకు మినహా… మిగిలిన సీఆర్డీయే పరిధిలోని ఊర్లకు ఎందుకు కేటాయించలేదు..?
- 2029 నాటికి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులతో కూడిన బేసిక్ కేపిటల్ పూర్తి చేస్తామని చెబుతున్నారు.. బేసిక్ కేపిటల్ కే రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తే, ల్యాండ్ పూలింగ్ లో రైతుల నుంచి తీసుకున్న ప్లాట్లు డెవలప్మెంట్ కు ఇంకెంత ఖర్చు చేయాలి..?
- అమరావతిలో ఎకరం విలువ రూ.10 కోట్లు ఉందని, భవిష్యత్తులో రూ.20 కోట్లకు చేరుతుందని చెబుతున్నారు.. కానీ, చంద్రబాబు తన ఇంటి నిర్మాణానికి ఎకరం రూ.3.63 కోట్లకు కొన్నారు కదా..?
- ఈ లెక్కన ఎకరం రూ.10 కోట్లు పలుకుతుందని మంత్రి నారాయణ చెప్పేవన్నీ అబద్ధాలే కదా..? అంటే.. ప్రభుత్వం వద్ద ఉన్న 5 వేల ఎకరాలు అమ్మినా వచ్చే ఆదాయం రూ.18,150 కోట్లు అవుతుంది కదా..? రూపాయి ఖర్చు పెట్టి పది పైసలు ఆదాయం పొందడమేనా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటే..?
ఇలా అమరావతిపై వైసీపీ నుంచి ప్రభుత్వంపైకి ప్రశ్నల బాణాల వర్షం కురుస్తుంది.
అయితే… ఈ ప్రశ్నలకు ట్రోలింగ్స్, డైవర్షన్స్, అరెస్ట్స్ వంటి వాటితో కాకుండా… కచ్చితంగా సవివరంగా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. అలాకాని పక్షంలో… జగన్ & కో చెప్పేవన్నీ పూర్తి వాస్తవాలని ప్రజలు పూర్తిగా నమ్మే అవకాశం లేకపోలేదు. ఇది కూటమి నేతలు జ్ఞప్తికి ఉంచుకోవాల్సిన విషయం!
ఇదే సమయంలో… చంద్రబాబు చెబుతున్న దానికి, జగన్ వెల్లడిస్తున్నవాటికీ మధ్య వ్యత్యాసాన్ని, నిజానిజాలనూ విజ్ఞులైన ప్రజలు పరిశీలించాలి.. ఆలోచించాలి.
చంద్రబాబు ప్రణాళికతో అసలు రాజధాని వస్తుందా..? ఉద్యోగాలు ఇచ్చే నగరంగా, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి ఎప్పుడు మారుతుంది? ఈ దఫా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులతో కూడిన బేసిక్ కేపిటల్ పూర్తి చేస్తామని చెబుతుంటే… ఇంతకాలం చూపించినవి ఎప్పటికి పూర్తవ్వాలి..? చంద్రబాబు చెబుతోన్న దేవతల రాజధాని మరో దౌలతాబాద్ కాకూడదని ఆంధ్రులు ఎంతమంది దేవుళ్లను మొక్కాలి..? కూటమి పెద్దలే సమాధానం చెప్పాలి!
