Vijayasai Reddy : మోడీ మెప్పు కోసమే విసారె ట్వీటేశారా.?

Vijayasai Reddy :  రాహుల్ గాంధీ ఏమీ దేశ ప్రధాని కాదు.. ఆయన కాంగ్రెస్ ఎంపీ మాత్రమే. నేపాల్ నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ చిందులేశారనీ, అక్కడ చైనా రాయబారితో ఆయన మంతనాలు జరిపారనీ ఆరోపిస్తూ బీజేపీ ఓ వీడియో విడుదల చేసింది. దీన్ని ‘హనీ ట్రాప్’గా అభివర్ణిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీటేశారు.

నిజానికి, జాతీయ స్థాయిలో బీజేపీ – కాంగ్రెస్ మధ్యనున్న రాజకీయ వైరం నేపథ్యంలో ఇలాంటి చవకబారు ఆరోపణలు సర్వసాధారణమే. ఆ పంచాయితీలోకి విజయసాయిరెడ్డి ఎందుకు ఎంటర్ అయ్యారన్నదే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ అధిష్టానం సైతం విజయసాయిరెడ్డి ట్వీట్ విషయంలో అసహనం వ్యక్తం చేసినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో వైసీపీని కలపాలని ఎన్నికల వ్యూహకర్త, వైఎస్ జగన్ స్నేహితుడు ప్రశాంత్ కిషోర్ వ్యూహ రచన చేస్తున్నారు మరి.

2024 ఎన్నికల నాటికి ఈక్వేషన్స్ ఎలాగైనా మారొచ్చు. కాంగ్రెస్‌తో వైసీపీ కలిసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ విషయంలో వైసీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ‘మేమెందుకు కలుస్తాం.?’ అని అంటూనే, ‘రాష్ట్ర ప్రయోజనాల రీత్యా అవసరమైతే అప్పుడు ఆలోచిస్తాం..’ అని వైసీపీ అంటోన్న సంగతి తెలిసిందే.

ఈ సమయంలో విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ భావి ప్రధానిగా చెప్పబడే రాహుల్ విషయమై అత్యుత్సాహం చూపడానికి కారణం బీజేపీ మెప్పు పొందాలనే.. అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.