Temples Built By Devils : దెయ్యాలకు దేవాలయాల్లోకి ఎంట్రీనే లేదు. దెయ్యం నుంచి తప్పించుకోవడానికి గుడిలోకి వెళ్లి దాక్కోవడాన్ని చాలా సినిమాల్లో చూశాం. కానీ, ఇక్కడ దెయ్యాలే ఓ దేవాలయాన్ని కట్టేశాయ్. అదీ మనుషుల కోసం.
ఈ వింత ఎక్కడ జరిగిందబ్బా అనుకుంటున్నారా.? కర్ణాటకలోని, బొమ్మవరె గ్రామంలో. అవునండీ మీరు విన్నది నిజమే. బొమ్మవరెలోని సుందరేశ్వరస్వామి దేవాలయం చాలా పురాతనమైనది. ఈ గుడిని కొన్ని దశాబ్ధాల క్రితం దెయ్యాలు కట్టిన గుడిగా చెబుతారు.
అసలు దెయ్యాలు గుడి కట్టడమేంటీ.? అందుకోసం ఓ కథ ప్రచారంలో వుంది. పూర్వం ఆ గ్రామాన్నిదెయ్యాలు పట్టి పీడించేవట. అదే ఊళ్లో వుండే మాంత్రికుడు దెయ్యాల పీడ పోగొట్టేందుకు ఊరి జనం సహకారంతో ఓ మహిమాన్విత శివాలయాన్ని నిర్మించాడట. అది ఇష్టం లేని దెయ్యాలు రాత్రికి రాత్రే ఆ గుడిని కూల్చేశాయట.
దాంతో కోపగించిన ఆ మాంత్రికుడు శివుని ప్రత్యేక అనుగ్రహంతో తన వద్ద వున్న శక్తినంతటినీ ధారపోసి ఆ దెయ్యాలను బంధించేశాడట. తమను విడిచిపెట్టమని దెయ్యాలు వేడుకోగా, కూల్చేసిన గుడిని తిరిగి నిర్మించి ఈ ఊరు విడిచి వెళ్లిపోవాలని దెయ్యాలకు షరతు పెట్టాడట ఆ మాంత్రికుడు. దాంతో రాత్రికి రాత్రే ఆ గుడిని కట్టేసి దెయ్యాలు మాయమైపోయాయట.
అదే నేటి సుందరేశ్వర స్వామి దేవాలయం. ఆ తర్వాత ఈ ఆలయంలో శివలింగ ప్రతిష్టాపన జరిగిందట. ఇక్కడి లింగం తెలుపు రంగులో చూసేందుకు చాలా సుందరంగా కనిపిస్తుంది. అందుకే సుందరేశ్వరుడిగా ఇక్కడి శివుడు పూజలందుకుంటున్నాడు. అదీ దెయ్యాల గుడి కథ.
