మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సంగ్రామం మూడు నెలల ముందుగానే మొదలైంది. ఊహించని విధంగా మా ఎన్నికలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. అధ్యక్ష పోటీలో ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ నలుగురు సై అంటున్నారు. దీంతో ఈ ఎన్నికలు మాత్రం గతంలో కంటే రసవత్తరంగా మారేందుకు ఎక్కువ అవకాశాలున్నట్టు కనిపిస్తోంది.
బరిలో ఉన్న నలుగురిలో ప్రకాష్ రాజ్ పోటీలో నిలవటం అందరికి కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంది. కన్నిడిగు కావటంతో ఆయనకు మద్దతుగా నిలిచేవారుంటారా అని అందరిలోనూ సందేహం ఉంది. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాను గమనించాక ఈ ప్యానెల్ కి మిగిలిన వారు పోటీ ఇవ్వగలరా అన్న కొత్త సందేహం ఇప్పుడు అందరిలోనూ మొదలైంది.
ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులను ప్రకటించిన సందర్భంగా మాట్లాడుతూ… త్వరలో జరగనున్న మా ఎన్నికలను పురస్కరించుకొని… ‘మా’ శ్రేయస్సు దృష్ట్యా… నిర్మాణాత్మక ఆలోచనలని ఆచరణలో పెట్టే దిశగా మా ప్రతిష్టకోసం… మన నటీ నటుల బాగోగుల కోసం… సినిమా నటీనటులందరి ఆశీస్సులతో… అండదండలతో… ఎన్నికలలో నిలబడటం కోసం… పదవులు కాదు పనులు మాత్రమే చేయడం కోసం… ‘మా’ టీంతో రాబోతున్నాం అని పేర్కొన్నారు. తన ప్యానల్ కు సిని’మా’ బిడ్డలు అని నామకరణం చేశారు.
సభ్యుల వివరాలు ఇవే…ప్రకాశ్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయికుమార్, తనీశ్, ప్రగతి, అనసూయ, సన, అనితా చౌదరి, సుధ, అజయ్, నాగినీడు, బ్రహ్మాజీ, రవి ప్రకాశ్, సమీర్, ఉత్తేజ్, బండ్ల గణేశ్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, టార్జాన్, సురేశ్ కొండేటి, ఖయ్యుం, సుడిగాలి సుధీర్, గోవిందరావు, శ్రీధర్ రావు.