“వాగుతారో, ఊగుతారో”… ప్రకాష్ రాజ్ కు “బిగ్” బ్యాడ్ న్యూస్.. !

కొంతమంది ‘ముక్కు సూటిగా మాట్లాడతారు’ అని అంటారు.. మరికొంతమంది ‘అతనికి పొగరు ఎక్కువ’ అని చెబుతారు. కొంతమంది ‘అతనికి అహంభావం ఎక్కువ’ అని అంటారు.. మరికొంతమంది ‘టాలెంటెడ్ పర్సన్’ అని కొనియాడతారు. కొంతమంది ‘అతను హిందూ వ్యతిరేకి’ అని అంటారు.. ఇంకొంతమంది ‘అతని కులం సమాజం, మతం మానవత్వం’ అని వెనకేసుకొస్తారు.

‘ఆయనకు ప్రతిభ పుష్కలంగా ఉందని’ కొంతమంది అంటారు.. అయితే, ‘విధేయత లేదని’ ఇంకొంతమంది వేలెత్తి చూపుతారు. కానీ ఆయన మాత్రం… ‘విధేయతకు, బానిసత్వానికీ తేడా తెలుసుకోవాలని’ సూచిస్తారు. ఆయనే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. సమస్య ఏదైనా సామాన్యుడి కోణంలో స్పందిస్తూ.. మత రాజకీయాలతో పబ్బం గడుపుకుంటుందంటూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. కాషాయం కనిపిస్తే కౌంటర్లు వేస్తుంటారు!

ఈ క్రమంలో తాజాగా ప్రకాష్ రాజ్ పై సినిమా ఇండస్ట్రీలో మరోసారి బ్యాన్ అస్త్రం సంధించాలని ఓ వర్గం జనాలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అందులో చాలామందికి అసలు ప్రకాష్ రాజ్ ఏమన్నారు.. ఏ ఉద్దేశ్యంతో అన్నారు అనేది దాదాపు తెలియదనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. కాకపోతే ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఉత్తర భారతం, దక్షిణాది వంటి పదాలు.. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత వంటి పేర్లు ఉండటమే ఇక్కడ ప్రధాన సమస్య కావొచ్చు.

ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఓ పిట్ట కథ చెప్పారు. కాకపోతే దీన్ని రామాయణంతో ముడిపెట్టినట్లు వివరించారు! ఇందులో భాగంగా… లక్ష్మణుడు ఒకసారి రాముడితో ముందు ఒక అడవి ఉందని, అక్కడి పండ్లు తినవచ్చా అని అడిగాడని ఆయన చెప్పారు. దానికి రాముడు… అది మరొకరి పొలమని, కానీ ఆకలిగా ఉంటే తినవచ్చని, అది ‘దొంగతనం’గా పరిగణించబడదని బదులిచ్చాడు.

ఆ తర్వాత.. “వారు భోజనం చేస్తుండగా.. రావణుడి సోదరి అయిన శూర్పణఖ, రావణుడు అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. కోపంగా ఉన్న శూర్పణఖ, ‘అన్నా, వాళ్ళు పండ్లు తింటున్నారు’ అంది. దానికి రావణుడు.. ‘వాళ్ళకి ఆకలిగా ఉంది. వాళ్ళని తిననివ్వండి. మనం తర్వాత మాట్లాడుకుందాం’ అన్నాడు.”

అప్పుడు రాముడు.. రావణుడు, శూర్పణఖలను గిరిజనులని భావించాడని.. అయితే అది గ్రహించిన రావణుడు.. తాము ‘యజమానులం’ అని నొక్కి చెప్పాడని ప్రకాష్ రాజ్ తెలిపారు.

ఈ క్రమంలో… “మేము మీ పొలంలో పండ్లు తిన్నాము, కాబట్టి మేము డబ్బు చెల్లిస్తాము” అని రాముడు అన్నాడు. దీనికి శూర్పణఖ, ‘జీఎస్టీతో కలిపి 2,000 డాలర్లు’ అని చెప్పింది. రావణుడు రాయితీ ఇచ్చినా కూడా.. తమ దగ్గర డబ్బులు లేవని రాముడు, లక్ష్మణుడు చెప్పారు.

అప్పుడు రావణుడు.. ‘మీరు పండ్ల కోసం ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు పండ్లు తిన్నారు కాబట్టి, వాటి విత్తనాలు నాటి, చెట్లు పెంచి, తిరిగి వెళ్ళండి’ అని అన్నాడు.’

దీంతో… ప్రకాష్ రామాయణ వృత్తాంతాన్ని వివరించడాన్ని చాలామంది ఉత్తర-దక్షిణ వివాదంపై ఒక వ్యాఖ్యగా చూశారు.. ఇదే సమయంలో పిట్టకథలకు రామాయణాన్ని ఎంచుకోవడాన్ని హిందుత్వంపై దాడిగా మరికొంతమంది చూస్తున్నారని అంటున్నారు.

అయితే… మరికొంతమంది మాత్రం దక్షిణాది రాష్ట్రాలపై మొన్న హిందీ, ఇప్పుడు తాజాగా సంస్కృతం భాషలను రుద్దే ప్రయత్నాలకు ఇది కౌంటర్ అని అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా… హిందీని కేరళ మీద రుద్దడంపై ఆయన విమర్శ చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా… నార్త్ ఇండియా నుంచి బతుకుతెరువు కోసం కేరళ వచ్చేవాళ్లు మళయాళం నేర్చుకోవాలి.. లేదంటే వచ్చిన పని చూసుకుని వెళ్లిపోవాలి.. అంతే తప్ప ఇక్కడి ప్రజలందరినీ హిందీ నేర్చుకోమని చెప్పడం కరెక్టు కాదని ఈ కథ ద్వారా ప్రకాష్ రాజ్ చెప్పారని అంటున్నారు.

అయితే… ప్రకాష్ రాజ్ చెప్పిన పిట్ట కథలోని అర్థం, భావం, తాత్పర్యం అర్ధం కాని చలా మంది ఆయన మాటల్లోని ఉత్తర భారతదేశం, రాముడు, సీత, లక్ష్మణుడు వంటి వాటిని మాత్రమే విని.. సరికొత్త భావానువాదం చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా… ప్రకాష్ రాజ్ ఏ ఉద్దేశ్యంతో ఆలోచించినప్పటికీ … దీనికోసం ఎంచుకున్న వృత్తాంతం మాత్రం ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేదిగా ఉన్నాయని చెబుతున్నారు.

140కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో అంతా ఒకే విధంగా ఆలోచిస్తారని అనుకోకూడదని.. రకరకాల అభిప్రాయాలు, రకరకాల ఆలోచనలు, విభిన్న అవగాహనా స్థాయిలు, వందల కోట్ల మనోభావాలు ఉన్న నేపథ్యంలో… కాస్త ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని పలువురు ప్రకాష్ రాజ్ కు హితవు పలుకుతున్నారు. మీ వెర్షన్ బలంగా చెప్పే హక్కు మీకు ఉందన్నది ఎంత నిజమో.. అవతలి వారి మనోభావాలను కించపరచకూడదనేదీ అంతే వాస్తవమని గ్రహించాలని చెబుతున్నారు.

ఇక ఈ గ్యాప్ లో సినిమాలో ప్రకాష్ రాజ్ ని బ్యాన్ చేయాలనే సోషల్ మీడియా డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయ‌న‌ తాజాగా నటిస్తోన్న రాజమౌలి సినిమా ‘వారణాసి’, సందీప్‌ రెడ్డి వంగ‌ సినిమా ‘స్పిరిట్’, అజ‌య్ దేవ‌గ‌న్ సినిమా ‘దృశ్యం – 3’ లనుంచి ప్ర‌కాష్ రాజ్ తొల‌గించి, ఆర్టిస్ట్‌గా బ్యాన్ చేయాల‌ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్ర‌కాష్‌ రాజ్ బ్యాన్ అంటూ నెట్టింట పోస్ట్‌ లు పెడుతున్నారు. అయితే ఈ డిమాండ్ లపై సదరు దర్శకులు ఇంకా స్పందించింది లేదు!

తాజాగా ఈ విషయాలపై ప్రకాష్ రాజ్ స్పందించారు. కేరళ లిటరరీ ఫెస్టివల్‌ లో తన మాటలను వక్రీకరించారని.. తాను శ్రీరాముడిని ఎగతాళి చేశానని, హిందూమతాన్ని కించపరిచేలా మాట్లాడానని చెబుతున్నారని అన్నారు. అయితే.. అన్ని మతాలను, అందరినీ ప్రేమించే తనకు ఆ అవసరం లేదని.. ధర్మాన్ని, మతోన్మాదాన్ని ముడిపెట్టి అసహ్యకరమైన రాజకీయం చేస్తున్నవారు.. తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక పోతున్నారని తెలిపారు.

ఇదే సమయంలో… తనను హిందూధర్మ వ్యతిరేకి అని నిందించేందుకు ప్రయత్నిస్తున్నారని.. వాళ్ల ఏడుపు, వాళ్ల కష్టం తనకు అర్థమైందని.. వాళ్లకు సమాధానం చెప్పాలని.. అందుకు త్వరలో వస్తానని.. అప్పటిదాకా ఇలాగే వాగుతారో, ఊగుతారో మీ ఇష్టం.. అంటూ ప్రకాష్‌ రాజ్‌ వీడియో సందేశం వదిలారు. మరి ప్రకాష్ రాజ్ ఎప్పుడు బయటకు వస్తారు.. ఎప్పుడు దీనిపై స్పందిస్తారు.. అప్పటి వరకూ ఎవరు వాగాలు, ఎవరు ఊగాలి అనేది తెలియాల్సి ఉంది!

అయితే ప్రకాష్ రాజ్ కు ఇలాంటి బెదిరింపులు, తనపై ఇండస్ట్రీలో బ్యాన్ డిమాండులు కొత్తేమీ కాదనే చర్చా జరుగుతుంది. గ‌తంలో పవన్ కల్యాణ్ ‘గుడుంబా శంక‌ర్‌’ సినిమాలో ఆశిష్ విద్యార్థి చేసిన క్యారెక్ట‌ర్ కోసం టీమ్ ముందు ప్ర‌కాష్ రాజ్‌ ని సంప్ర‌దించగా.. ప్రకాష్ రాజ్ వారిని తిరస్కరించారని అంటారు. అక్కడితో అయిపోలేదు సరికదా.. వారిని అవ‌మానించారనే ప్రచారమూ జరిగింది.

ఇదే క్రమంలో.. ఆ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల విష‌యంలోనూ ఇదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించాడనే చర్చ జరిగింది. దీంతో.. ఈ విషయన్ని సీరియ‌స్‌ గా తీసుకున్న “మా” అసోసియేష‌న్.. టాలీవుడ్ లో ప్ర‌కాష్ రాజ్‌ ని బ్యాన్ చేసింది. ఆ త‌రువాత చిరంజీవి ఎంట్రీతో ఆ బ్యాన్‌ ని తొలగించారు. దీనిపై ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో “ఓపెన్” అయిన ప్రకాష్ రాజ్… ఏదైనా తప్పు జరిగితే శిక్ష విధించాలి కానీ, ఏకంగా ఉరిశిక్ష విధించకూడదు కదా అని స్పందించారు.

కాగా… ఇటీవల పార్లమెంట్ లో వీగిపోయిన డీలిమిటేషన్ బిల్లు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ.. దీనిపై ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలపై ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని డిప్యూటీ సీఎంను చేశారు.. వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంటులో తగ్గిపోతుంది. ఈ అంశంపై మీతో చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా? అంటూ పవన్ కల్యాణ్‌ ను ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.

ఇదే సమయంలో… ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరు అబద్ధం చెబుతున్నారని దేశం గుర్తుంచుకుంటుంది సార్.. జస్ట్ ఆస్కింగ్ అంటూ తనదైన శైలిలో విమర్శించారు. ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలకు అబద్ధాలు చెప్పవద్దని ఆయన హితవు పలికిన సంగతి తెలిసిందే!