Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ లక్ష్యంగా రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శ్రీనివాస్ రెడ్డి ప్రాణహాని తలపెట్టే స్థాయి హెచ్చరికలు జారీ చేయడం పెను సంచలనంగా మారింది.
వివాదానికి కారణం ఏమిటి?
ఇటీవల ఒక సందర్భంలో ప్రకాష్ రాజ్ రామాయణం, శ్రీరాముడి గురించి ప్రస్తావిస్తూ.. ఉత్తర భారతదేశం నుండి వచ్చిన రాముడు, లక్ష్మణుడు అడవిలో పండ్లు తింటే జీఎస్టీ కట్టాలా? అని ప్రశ్నించారు. “వన్ నేషన్.. వన్ రిలీజియన్” అంటూ ఆయన చేసిన వ్యంగ్యాస్త్రాలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ వివాదంపై స్పందిస్తూ ప్రకాష్ రాజ్పై విరుచుకుపడ్డారు. ఆయన చేసిన ప్రధాన వ్యాఖ్యలు. “ప్రకాష్ రాజ్ను ఎవరైనా హత్య చేస్తే, ఆ కేసులో నేనే ఏ1 ముద్దాయిగా ఉంటాను. దానికి పూర్తి బాధ్యత నాదే” అని సంచలన ప్రకటన చేశారు.
ప్రకాష్ రాజ్ను ‘అర్బన్ నక్సలైట్’ అని, ‘టుకుడే గ్యాంగ్’ సభ్యుడని అభివర్ణించారు. జేఎన్యూలో దేశ వ్యతిరేక నినాదాలు చేసిన వారికి ఆయన మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. నాస్తికుడినని చెప్పుకునే ప్రకాష్ రాజ్, కేవలం హిందూ ధర్మాన్ని, సనాతన సంప్రదాయాలను మాత్రమే ఎందుకు అవమానిస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీని విమర్శించే క్రమంలో దేవుళ్లను కించపరచడం సహించరాని నేరమని పేర్కొన్నారు.

షూటింగ్లను అడ్డుకుంటాం.. బహిష్కరించండి! కేవలం వ్యాఖ్యలకే పరిమితం కాకుండా, ప్రకాష్ రాజ్ పట్ల కార్యాచరణను కూడా శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ఎక్కడ షూటింగ్లో పాల్గొన్నా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆయన టూర్ డైరీని ఫాలో అవుతామని, హిందూ మనోభావాలను దెబ్బతీస్తే వెంటాడి వేటాడుతామని వార్నింగ్ ఇచ్చారు. టాలీవుడ్ అగ్ర హీరోలు, నిర్మాతలు స్పందించి ప్రకాష్ రాజ్ను సినిమాల నుంచి పూర్తిగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
పాకిస్థాన్లో అజ్ఞాత వ్యక్తులు చేస్తున్న ఆపరేషన్లను గుర్తుపెట్టుకోవాలని, ఇది ‘నయా భారత్’ అని ఆయన వ్యాఖ్యానించడం పరోక్షంగా ప్రాణహాని హెచ్చరికలను సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రకాష్ రాజ్ గతంలో ఇలాంటి విమర్శలపై స్పందిస్తూ తన భావ ప్రకటనా స్వేచ్ఛను సమర్థించుకున్నారు. అయితే, ఒక బాధ్యతాయుతమైన పార్టీ పదవిలో ఉన్న వ్యక్తి, బహిరంగంగా “హత్య చేస్తే ఏ1 గా ఉంటాను” అని ప్రకటించడంపై పౌర సమాజం నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

