జనసేనకి ఇదే బెస్ట్ ఛాన్స్.! మళ్ళీ రావడం కష్టమే.!

రాష్ట్రంలో అధికార పక్షం మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్షం మీద ప్రజల్లో పెద్దగా ఆశల్లేవు. ఎలా చూసినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ వ్యాక్యూమ్ వుందన్నది నిర్వివాదాంశం. మరి, దీన్ని క్యాష్ చేసుకునేదెవరు.? ముమ్మాటికీ జనసేన పార్టీనే అవ్వాలి. కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆలోచనలే ఎవరికీ అర్థం కావడంలేదు.

వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్నది పవన్ కళ్యాణ్ ఉవాచ. దానర్థం పరోక్షంగా టీడీపీని ముందర పెట్టి, జనసేన సహా బీజేపీ, ఇతర రాజకీయ పార్టీలన్నీ ఓ కూటమిగా వుండాలన్నది జనసేన ఆలోచన అని వైసీపీ అంటోంది. టీడీపీ కూడా ఇదే భావనతో వుంది. అయితే, జనసేన అసలు వ్యూహం వేరేగా వుందట. అదేంటో ఆ పార్టీ నేతలు స్పష్టతనివ్వడంలేదు. ఆ స్పష్టత పవన్ కళ్యాణ్‌కైనా వుందో లేదో మరి.!

ఒక్కటి మాత్రం నిజం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ వాక్యూమ్ వుంది. దాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సద్వినియోగం చేసుకోగలగాలి. గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడూ పొలిటికల్ వాక్యూమ్ వుంది. కానీ, దాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారు. చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటు బ్యాంకు లభించినా, చిరంజీవి రాజకీయాల్లో నిలబడలేకపోయారు.

పవన్ కళ్యాణ్ పరిస్థితి మరీ దారుణం. ముందే చేతులెత్తేస్తున్నారు. అదే ఆయనతో అతి పెద్ద సమస్య. రాజకీయాల్లో అవకాశం వచ్చినప్పుడు సత్తా చాటాలి. పాతికేళ్ళ లక్ష్యం.. అని పెట్టుకు కూర్చుంటే కుదరదు ముహూర్తం.

కోనసీమ అల్లర్లు సహా అనేక అంశాల్లో అధికార పార్టీ వైఫల్యం బయటపడిపోయింది. మంత్రుల బస్సు యాత్ర తేలిపోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దావోస్ పర్యటన తర్వాత ఈక్వేషన్స్ మరింత దిగజారిపోయాయి వైసీపీకి సంబంధించి.

ఇంత సానుకూల పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మౌనం అంటే.. అందివచ్చిన అవకాశాన్ని జనసేన దుర్వినియోగం చేసుకుంటున్నట్టే.