అసలంటూ ఆగితే కదా.. మళ్ళీ మొదలవడానికి.. అనే డౌట్ మీకొస్తే, అది మీ తప్పు కానే కాదు.! అయినాగానీ, చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలెట్టారు ట్వీట్ల యుద్ధాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈసారి పర్యావరణానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా, ఏపీ ప్రభుత్వంపైనా ప్రశ్నాస్త్రాలు సంధించేశారు జనసేనాని.
అయితే, ప్రతిసారిలాగానే ఈసారి కూడా జనసేనాని ప్రశ్నల్లో వాస్తవాలున్నాయ్. ప్రజల్ని ఆలోచింపజేసే అంశాలున్నాయి. టైమింగ్లో జనసేన అధినేతను తప్పు పట్టడానికేమీ లేదు. కాకపోతే, ఆయా ప్రశ్నలు సంధించడంలో జనసేనాని చిత్తశుద్ధి ఎంత.? అన్నదే మిలియన్ డాలర్ల క్వశ్చన్.
చంద్రబాబు హయాంలో అన్యాయాలు, అక్రమాలు జరిగినా జనసేన పార్టీ స్పందించలేదన్నది వైసీపీ ప్రధాన ఆరపణ. అప్పుడు స్పందించలేదు కాబట్టి, ఇప్పుడు అన్యాయాలు, అక్రమాలు జరుగుతోంటే ఎవరైనా చూసీ చూడనట్టు ఊరుకోవాలా.? అన్న ప్రశ్న వైసీపీ వైపే దూసుకెళుతుంది.
పర్యావరణం విషయంలో ప్రభుత్వాల దుశ్చర్యల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎవరు అధికారంలో వున్నా పర్యావరణ విధ్వంసం అనేది నిరంతరంగా కొనసాగుతూనే వుంటుంది. ప్రభుత్వాల పాలసీలు పైకి కనిపించేంత క్లియర్గా వుండవ్. తెరవెనుక కార్పొరేట్ శక్తులు.. ప్రకృతిని సర్వనాశనం చేసేస్తుంటాయ్.. వాటికి తలొగ్గాల్సిందే.
ఇదేమీ కొత్త విషయం కాదు.. బహిరంగ రహస్యమే. విశాఖలో ఏకంగా రుషి కొండనే తవ్వేస్తున్నారు. చంద్రబాబు హయాంలోనూ జరిగింది.. వైసీపీ హయాంలో మరింత దారుణంగా జరుగుతోంది. ‘అబ్బే, మేం పద్ధతి ప్రకారమే చేస్తున్నాం..’ అని వైసీపీ చెప్పొచ్చుగాక. కానీ, అక్కడ జరుగుతున్న విధ్వంసం అందరి కళ్ళకూ కనిపిస్తోంది.
నిన్ననే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు వెళ్ళి, ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. కానీ, నిజానికి వైఎస్ జగన్ ప్రకటించాల్సింది, కాలుష్య కారక పరిశ్రమల్ని మూసేస్తామనో, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామనో. ఈ విషయాన్నే జనసేనాని ప్రశ్నించారు. అడవుల నరికివేత జరుగుతోంది.. సముద్రం ఒడ్డున ఇసుక దోపిడీ జరుగుతోంది.. ఇలా వీటన్నిటినీ జనసేనాని తన ట్వీటాస్త్రాలతో ప్రశ్నించారు.
