ఈ మధ్యకాలంలో అయితే పవన్ కళ్యాణ్, ప్రధాన మంత్రి నరేంద్రద మోడీని కలవలేదు. కానీ, కలిసినట్టు చూపిస్తోంది జనసేన పార్టీ. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ ఇమేజ్ అవసరమైంది. మిత్రపక్షం జనసేన పార్టీని తిరుపతి ఉప ఎన్నిక విషయమై మొదటి నుంచీ పక్కన పెట్టినా, ఉప ఎన్నిక ప్రకటన వచ్చిన దగ్గరనుంచి సీన్ మారింది. ‘మాకు జాతీయ స్థాయిలో దక్కుతున్న గౌరవం రాష్ట్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ నుంచి రావడంలేదు’ అని సాక్షాత్తూ పవన్ కళ్యాణ్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకోపక్క, పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించినా ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు అవకాశం దక్కడంలేదన్న ప్రచారమూ వుంది.
ఇంతలా గ్యాప్ బీజేపీ – జనసేన మధ్య కనిపిస్తుండడంతో తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా బీజేపీ.. ఒకింత డీలాపడుతోంది. కొంత జోష్ తెచ్చుకునేందుకోసం సోషల్ మీడియా వేదికగా పలు వీడియోలు వదులుతోంది బీజేపీ. తాజాగా వదిలిన వీడియోలో, ఒకప్పడు పవన్ కళ్యాణ్ – నరేంద్ర మోడీ కలిసిన సందర్భాన్ని ఉపయోగించారు. దాంతో, ఈ వీడియో సరికొత్త టెన్షన్స్ తెచ్చిపెడుతోంది బీజేపీకి. ‘మా నాయకుడికి మీరిస్తున్న గౌరవం ఇదేనా.? ఇప్పటికైనా మోడీతో పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం కల్పించి.. ఆ వీడియోలు వాడుకోండి..’ అని బీజేపీకి జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ఉచిత సలహాలిస్తున్నారు. కానీ, సమయం లేదిప్పుడు. పవన్ కళ్యాణ్ వద్దకు స్వయంగా బీజేపీ నేతలు వెళ్ళి మద్దతు అడిగినా, పుష్పగుచ్ఛం మినహా.. అట్నుంచి పూర్తి స్థాయి భరోసా బీజేపీకి దక్కలేదన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంత గందరగోళ స్థితిలోకి బీజేపీ వెళ్ళిపోవడానికి కారణం ఇంకెవరో కాదు.. బీజేపీ నాయకత్వమే. ‘మేమే గొప్ప’ అనే అహంకారం బీజేపీని ఇప్పుడిలా కింద పడేస్తోంది.