ఏపీతో పోలిక… బెంగాల్ లో మమతకు ‘మోడిం’దా..?

భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ… గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో అన్నట్లుగా ఓటర్లు పోలింగ్ బూత్ లకు పోటెత్తుతున్న సంఘటనలు తాజాగా వరుసగా జరుగుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఇటీవల అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కు జనం పోటెత్తిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా… అస్సాంలో రికార్డు స్థాయిలో 85శాతానికి పైగా.. కేరళలో 78శాతానికి మించి.. పుదుచ్చేరిలో 89శాతంపైనే పోలింగ్‌ నమోదైంది. దీనికి మించి అన్నట్లుగా గతంలోని రికార్డులన్నింటినీ తిరగరాస్తూ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ప్రజలు ప్రభంజనంలా కదలి వచ్చి ఓట్లు వేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులుగా ఎన్నికల్లో తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు!

దీంతో… తమిళనాడులో 85.14% పోలింగ్ నమోదవ్వగా.. పశ్చిమ బెంగాల్‌ లో 92.72% నమోదైంది. 2011లో బెంగాల్‌ లో నమోదైన 84.72 శాతం పోలింగే రాష్ట్రంలో ఇప్పటిదాకా అత్యధికం కాగా… తాజాగా ఆ రికార్డును బెంగాల్ వాసులు తిరగరాశారు. తమిళనాడులో 2021లో 73.63 శాతం.. 2011లో 78.29 శాతం పోలింగ్ నమోదవ్వగా.. ఈ సారి 85.14% మంది ఓటు వేశారు.

ఈ విధంగా… ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో వచ్చిన ఈ మార్పు.. ఎవరికి ప్లస్సు, మరెవరికి మైనస్సు.. అసలు ఓటరు మనసులో ఏముంది.. ఎవరిపై ఆగ్రహం ఉంది, ఎవరిపై పంతం ఉంది, మరెవరి పాలనలో ఉండాలని ఉంది.. ఈ మార్పు పాలనలో మార్పుకు సంకేతమా, నియంతృత్వ పోకడలకు పోతున్నారనే వారిపై ఆగ్రహానికి సాదృశ్యమా.. అనేది ఆసక్తిగా మారింది.

అయితే.. అటు అధికారంలో ఉన్నవాళ్లు, ఇటు ప్రతిపక్షంలో ఉన్నవారు సైతం.. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ.. ఈ పెరిగిన ఓటింగ్ తమ విజయానికి సంకేతం అని ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత అనే తారతమ్యాలేమీ లేవు.. పెరిగిన ఓటింగ్ తమ కోసమే అని ఎవరికి వారు అనుకుంటున్నట్లు కనిపిస్తున్నారు.. స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.

—-

కొన్ని చెదురుమదురు సంఘటనల మినహా పశ్చిమ బెంగాల్ లో ఓటింగ్ ఉన్నంతలో ప్రశాంతంగానే ముగిసింది. కొన్ని చోట్ల మాత్రం బీజేపీ నేతలపై దాడులు జరిగినట్లు కథనాలొచ్చాయి. ఏది ఏమైనా.. తొలివిడతలో భాగంగా ఆ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఉన్న 152 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు.

ఈ సందర్భంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ… ఓటర్లు పోటెత్తడం మార్పునకు సంకేతమని.. తృణమూల్‌ సిండికేట్‌ కు మే 4వ తేదీతో గడువు తీరబోతోందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే రెండో విడత పోలింగ్ కు ప్రచారం మొదలుపెట్టారు.

ఇదే సమయంలో.. పోలింగ్ బూత్ లకు రికార్డ్ స్థాయిలో పోటెత్తిన వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా… తొలి విడత పోలింగ్‌ తోనే తృణమూల్‌ విజయం ఖాయమైందని.. 152 స్థానాల్లోనూ 125నుంచి 134 సీట్లు తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

—-

ఇదే క్రమంలో… తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫలితంగా… గతంలో ఎన్నడూ లేని రీతిలో అన్నట్లుగా 85.14 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇది ఇప్పటిదాకా రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల కంటే అధికం కావడం గమనార్హం. దీంతో.. రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తోన్నాయి.

ఇందులో భాగంగా… ఈ భారీ పోలింగ్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి, ఈ ప్రభుత్వమే కొనసాగాలనే కోరికకూ సంకేతమని అధికార పక్షం అంటుంటే… ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు చిహ్నమని ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీ నేతలు చెబుతున్నారు.

మరోవైపు… ఇది పూర్తిగా విజయ్ పై ఉన్న ప్రేమకు నిదర్శనమని, యువత, కొత్త ఓటర్లు విజయ్ కోసం, మార్పు కోసం పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారని టీవీకే కార్యకర్తలు చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్… తమిళనాడు గెలవబోతోందని.. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని, రాష్ట్ర హక్కులను కాపాడారని అన్నారు.

ఈ క్రమంలో తాజా పరిణామాలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌ స్పందిస్తూ… పశ్చిమ బెంగాల్‌ లో 92 శాతానికిపైగా పోలింగ్‌ జరగడం స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారని తెలిపారు.

——

ఆ సంగతులు అలా ఉంటే… గత కొంతకాలంగా దేశంలోని ఎన్నికల్లో ఈవీఎంలపై తీవ్రమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా… 2024లో ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం ఈ చర్చ తీవ్రంగా జరిగింది. పైగా పలువురు విశ్లేషకులు కీలక సాక్ష్యాలను చూపిస్తూ ప్రజెంటేషన్స్ ఇచ్చిన పరిస్థితి!

ఇక… రాహుల్ గాంధీ తెరపైకి తెచ్చిన ఓట్ చోరీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైనప్పుడు… కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, హర్యానా రాష్ట్రాల్లో ఉన్న ఓటర్ లిస్టుని ఎన్నికల కమిషన్ తన అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించిందనే ప్రచారమూ సోషల్ మీడియా వేదికగా బలంగా జరిగింది!

ఇక… మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరమూ ఇదే చర్చ జరిగింది. ప్రధానంగా బీజేపీ కూటమి గెలుపొందిన రాష్ట్రాల్లో ఈ తరహా ఆరోపణలు, వాటికి సాక్ష్యాలంటూ కొన్ని పోస్టులు, దీనిపై ప్రజాస్వామ్య వాదులు, మేధావుల మధ్య కీలక చర్చలు, ఈసీ నుంచి సరైన వివరణ రావడం లేదనే ఆరోపణల నేపథ్యంలో.. పశ్చిమ బెంగాల్ పోలింగ్ అనంతరం మరో సారి ఈ తరహా చర్చ కొంతమంది మధ్య మొదలైంది!

మరి తాజాగా తీవ్ర ఆసక్తిగా మారిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో… “మమతకు మోడిందా.. లేక, మోడీకి మండిందా” అనేది వేచి చూడాలి. ఇక… డీఎంకే గెలిస్తేనే తమిళనాడు గెలిచిందనే ఆ పార్టీ నేతలకు తంబీలు ఏ మేరకు మద్దతు పలికారు.. బీజేపీ చేతిలో దక్షిణాది రాష్ట్రాలను పెట్టొద్దు అనే మాటను ఓటర్లు ఏ మేరకు విన్నారు.. విజయ్ ఆశిస్తున్నట్లు మార్పు దిశగా ఎంతమంది “విజిల్” వేశారు అనేది వేచి చూడాలి.