జూనియర్ ఎన్టీయార్‌కి బోల్డంత డ్యామేజ్ జరిగిందా.?

సినిమా వేరు.. రాజకీయం వేరు.. అనడానికి వీల్లేదు. రెండూ కలగలిసే వుంటున్నాయిప్పుడు. అయినాగానీ, రాజకీయాల్లో కొందరు సినీ ప్రముఖులు వేళ్ళు పెడితే, వ్యవహారం అడ్డం తిరిగిపోతోంది. యంగ్ టైగర్ ఎన్టీయార్ కూడా ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది.

చట్ట సభలు ఎలా వుండాలో జూనియర్ ఎన్టీయార్ ఓ ఉచిత సలహా ఇచ్చేశారు. అదీ, టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై స్పందిస్తూ. చంద్రబాబు సతీమణిపైనా వైసీపీ నేతలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్నది ప్రధాన ఆరోపణ.

నందమూరి కుటుంబ సభ్యుడిగా ఎన్టీయార్ స్పందించాడు. అంతలోనే, కుటుంబానికి చెందిన వ్యక్తిలా కాకుండా, బాధ్యతగల పౌరుడిగా.. అంటూ కవరింగ్ ఇచ్చాడు యంగ్ టైగర్. అదే, వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. తెలంగాణలో ఓటు హక్కు కలిగి వుండి, తెలంగాణలో వుంటూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఉద్దేశించి ఉచిత సలహాలివ్వడమేంటన్నది యంగ్ టైగర్ మీద వినిపిస్తోన్న విమర్శ.

‘నీ సినిమా వస్తోంది కదా.. ఆ సినిమా సంగతి చూస్తాం..’ అంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు బెదిరింపులకు దిగుతున్నారు. మరోపక్క బాలయ్యదీ ఇదే పరిస్థితి, అధికార వైసీపీకి బాలయ్య వార్నింగ్ ఇవ్వడంతో, బాలయ్య సినిమా ‘అఖండ’కి నెటిజన్లు కొందరు వార్నింగ్ ఇస్తున్నారు.

రాజకీయాల్లో విమర్శలు సహజం. ఆ విమర్శలు ఎప్పుడో హద్దులు దాటేశాయన్నదీ వాస్తవం. ఇలాంటి విషయాల్లో బాధ్యతగల పౌరులుగా ఎవరైనా స్పందించొచ్చు. కానీ, ఓ ‘సైడ్’ తీసుకుని మాట్లాడటమే వివాదాలకు కారణమన్నవిమర్శ వుంది.