CM Jagan : పెన్షన్ పెంపుపై పెదవి విరుపులే ఎక్కువ.. ఎందుకంటే.!

CM Jagan : వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 నుంచి వృద్ధాప్య పెన్షన్లు 2250 నుంచి 2500 రూపాయలకు పెరగనున్నాయి. ఇది జగన్ సర్కార్ ప్రకటించిన కొత్త సంవత్సర కానుక అనుకోవచ్చు. అయితే, పెరిగింది 250 రూపాయలు మాత్రమే కావడంతో, పెదవి విరుపులు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

2‌019 ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పటిదాకా పెంచింది ఒకే ఒక్కసారి.. అదీ 2250 రూపాయలు మాత్రమే. దఫ దఫాలుగా పెన్షన్లను 3 వేలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ లెక్కన, ఈపాటికే పెన్షన్ మొత్తం 2500 దాటేసి వుండాలి.

అయితే, కరోనా కష్టకాలం, ఆపై, రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు వెరసి.. పెన్షన్ పెంపు అనేది సాధ్యపడలేదన్నది ప్రభుత్వ వర్గాల వాదన. మరోపక్క, పెన్షన్ పెరుగుతుందని ఎదురుచూస్తున్న పండుటాకులు, ప్రభుత్వం తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే, పండుటాకులకు కొత్త సంవత్సర కానుకని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారని అనుకోవాలేమో. అయితే, ఆ పెంచేదేదో 2750 వరకు ఒకేసారి పెంచేసి వుంటే బావుండేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

కింది స్థాయిలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి అటు అధికారులు, ఇటు పార్టీ ముఖ్య నేతలు తీసుకెళుతున్న దరిమిలా, ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే, 2022లోనే ఇంకో పెంపు పెన్షన్ విషయంలో వున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.!