రెచ్చిపోయి ఆడుతున్న ఆసీస్ ‌.. ఈ మ్యాచ్‌లోను భారీ ల‌క్ష్యాన్ని నిర్ధేశిస్తారా?

ఐపీఎల్ త‌ర్వాత ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరీస్ ఆడేందుకు సిద్ద‌మైంది భార‌త్. మూడు వ‌న్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్‌ల‌తో రెండు నెల‌ల పాటు భార‌త్ బిజీ షెడ్యూల్ ఖ‌రారైంది. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గాక భార‌త్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కాగా, ఇందులో విజ‌యం సాధించాల‌ని క‌సితో ఉన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా కూడా సొంత గ‌డ్డ‌పై ట్రోఫీ ద‌క్కించుకోవాల‌నే క‌సితో ఉన్నారు. మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా శుక్ర‌వారం జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త్ 66 ప‌రుగుల తేడాతో ఘోర ప‌రాజ‌యం పాలైంది. ఈ రోజు రెండో వ‌న్డే ఆడుతున్నారు.

సిడ్నీ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డేవిడ్ వార్న‌ర్, ఫించ్ చేల‌రేగి ఆడారు. మొదటి మ్యాచ్‌లో పరుగుల వరద పారించిన ఆసీస్‌ ఓపెనర్లు రెండో వన్డేలోనూ అదే జోరు క‌న‌బ‌రిచారు. ఫించ్ 60 ప‌రుగుల ద‌గ్గ‌ర ఔట్ కాగా, వార్న‌ర్ 83 ప‌రుగుల ద‌గ్గ‌ర రనౌట్‌గా వెనుదిరిగారు.   స్మిత్‌,  లబుషేన్‌ క్రీజ్‌లో ఉన్నారు. దొరికిన‌ బాల్‌ని బౌండ‌రీకి త‌ర‌లిస్తూ స్కోర్ బోర్డ్ వేగాన్ని పెంచే పనిలో ప‌డ్డారు ఆసీస్ బ్యాట్స్ మెన్స్. అయితే గ‌త మ్యాచ్‌లో స్టాయినిస్ గాయ‌ప‌డ‌డంతో అత‌నికి విశ్రాంతి ఇచ్చి హెన్రిక్స్‌ని తీసుకున్నారు. భార‌త్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగింది.

సిరీస్ నిల‌బెట్టుకోవాలి అంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్స్ తేలిపోయినట్టు క‌నిపిస్తుండ‌గా, బ్యాట్స్‌మెన్స్ ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న ఇస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ మ్యాచ్ త‌ప్పక గెలిస్తేనే భార‌త్ టైటిల్ నిల‌బెట్టుకునే ఛాన్స్ ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా 26 ఓవ‌ర్ల‌కి గాను రెండు వికెట్ల న‌ష్టానికి 157 ప‌రుగులు చేసింది.

భారత్‌ తుదిజట్టు : శిఖర్ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హర్థిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, నవదీప్‌ సైనీ, షమీ, బుమ్రా, చహల్‌

ఆసీస్‌ తుది జట్టు : ఆరోన్‌ ఫించ్‌, డేవిడ్‌ వార్నర్‌, స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌,  మ్యాక్స్‌వెల్‌, కేరీ, మోయిసెస్ హెన్రిక్యూస్, కమిన్స్‌, స్టార్క్‌‌, జంపా, హెజల్‌వుడ్‌