పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ను కేంద్ర తాత్కాలిక ఆర్ధిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో రైతులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. రైతులకు రాష్ట్రాలతో సంబంధం లేకుండా పెట్టుబడి సాయంగా ఐదు ఎకరాలలోపు ఉన్న వారికి ఏడాదికి 6 వేల రూపాయల సాయాన్ని ప్రకటించారు.
ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ప్రకటించిన ఈ పథకంలో భాగంగా చిన్న, సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు వెళుతుందని చెప్పారు. మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన ప్రధానాంశాలు
- చిన్నసన్నకారు రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెడుతున్నాం.
- ఈ పథకం ద్వారా చిన్నసన్నకారు రైతులకు ఏడాదికి రూ. 6వేల సాయం అందజేస్తాం.
- ఐదెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఈ పథకం వర్తింపు
- రైతు సాయం కోసం 75 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు
- నేరుగా ఖాతాలోకే కేంద్రం నగదు సాయం. మూడు విడతల్లో నగదు అందజేత. తొలి విడతగా తక్షణమే రూ.2వేల సాయం.
- రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ నగదు నేరుగా రైతుల ఖాతాలోకి మళ్లింపు.