Budget: కేంద్ర బడ్జెట్ లో ఏపీకి బంపర్ గిఫ్ట్.. సెమీకండక్టర్–మినరల్ కారిడార్ డబుల్ బెనిఫిట్..!

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు భారీ ప్రాధాన్యం దక్కింది. దేశాన్ని హైటెక్ తయారీ రంగంలో ముందుకు తీసుకెళ్లే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేస్తూ, అరుదైన ఖనిజాల అభివృద్ధి కోసం ప్రత్యేక మినరల్ కారిడార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వెల్లడించారు. ఈ నిర్ణయం ఖనిజ సంపదలో ముందున్న రాష్ట్రాలకు కొత్త అవకాశాల ద్వారం తెరవనుంది. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా చోటు దక్కించుకోవడం రాష్ట్రానికి పెద్ద ఊరటగా భావిస్తున్నారు.

అరుదైన ఖనిజాలు భవిష్యత్తు పరిశ్రమలకు కీలకంగా మారుతున్న నేపథ్యంలో, వీటి అన్వేషణ, తవ్వకం, ప్రాసెసింగ్ మరియు సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్రం సమగ్ర ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఇప్పటికే ఏపీలో ఖనిజ వనరులపై పలు దఫాలుగా సర్వేలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మినరల్ కారిడార్ ఏర్పాటుతో ఈ వనరులను వాణిజ్యపరంగా వినియోగించుకునే మార్గం మరింత సులభమవుతుంది.

సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ రంగాలకు అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా గొలుసును దేశీయంగా బలోపేతం చేయడమే కేంద్ర లక్ష్యం. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి కేటాయింపులను గణనీయంగా పెంచుతూ రూ.40,000 కోట్ల వరకు మద్దతు ఇవ్వాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద పరిశ్రమల ఆధ్వర్యంలో రీసెర్చ్, ట్రైనింగ్ కేంద్రాల ఏర్పాటు, దేశీయ చిప్ డిజైన్ సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టనున్నారు.

ఈ నిర్ణయాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్, చిప్ డిజైన్, హైటెక్ తయారీ, మౌలిక సదుపాయాల రంగాల్లో కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఖనిజ వనరులు, పోర్టులు, పారిశ్రామిక మౌలిక వసతులు కలిసొచ్చేలా రాష్ట్రం కొత్త పారిశ్రామిక కేంద్రంగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలు అమలులోకి వస్తే, ఏపీకి పరిశ్రమల విస్తరణతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.