Araku: అరకు మీద కేంద్రం ఫోకస్.. టూరిజం మ్యాప్‌లో టాప్ ప్లేస్‌గా మారనున్న ప్రాంతం..!

కేంద్ర బడ్జెట్ 2026లో ఆంధ్రప్రదేశ్‌కు మరో కీలక ప్రాధాన్యం లభించింది. ముఖ్యంగా అరకు ప్రాంతాన్ని దేశవ్యాప్తంగా టూరిజం మ్యాప్‌పై మరింత బలంగా నిలబెట్టే నిర్ణయాలు ప్రకటించడం విశేషం. యువత నైపుణ్యాభివృద్ధి, హాస్పిటాలిటీ రంగ విస్తరణ, ట్రెక్కింగ్–ఎకోటూరిజం అభివృద్ధి లక్ష్యంగా కేంద్రం పలు కీలక ప్రణాళికలను బడ్జెట్‌లో వెల్లడించింది. దీంతో అరకు ప్రాంతం రూపురేఖలు మారనున్నాయని అధికారులు భావిస్తున్నారు.

యువతకు అంతర్జాతీయ ప్రమాణాల నైపుణ్యాలు అందించేందుకు కేంద్రం కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థ విద్యా వ్యవస్థ, పరిశ్రమలు, ప్రభుత్వ విభాగాల మధ్య అనుసంధానం కల్పిస్తూ హాస్పిటాలిటీ రంగంలో ప్రొఫెషనల్ శిక్షణకు కేంద్రంగా మారనుంది. టూరిజం, హోటల్ మేనేజ్‌మెంట్, ట్రావెల్ సర్వీసులు, అడ్వెంచర్ గైడింగ్ వంటి విభాగాల్లో ప్రత్యేక కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.

దేశవ్యాప్తంగా 20 ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి కేంద్రాలుగా గుర్తించిన కేంద్రం, ఆ జాబితాలో అరకు ప్రాంతానికి ప్రత్యేక స్థానం కల్పించింది. ట్రెక్కింగ్‌కు అనువైన కొత్త మార్గాలను రూపొందిస్తూ తాబేలు ట్రైల్, బర్డ్ వాచింగ్ ట్రైల్‌తో పాటు పలు ప్రకృతి, పురావస్తు ప్రాంతాలను అనుసంధానించే ప్రత్యేక ట్రైల్స్‌ను అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 15 పురావస్తు ప్రదేశాలను ఈ టూరిజం ప్రాజెక్ట్‌లో భాగం చేస్తున్నారు.

ఈ ప్రణాళికలతో అరకు ప్రాంతంలో సుమారు 10 వేల మంది యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్రెక్కింగ్ గైడ్స్, హాస్పిటాలిటీ సిబ్బంది, టూరిజం సర్వీస్ ప్రొవైడర్స్‌గా వారిని తీర్చిదిద్దేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. స్థానికులకు ఉపాధి, పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశం.

అదే సమయంలో IRCTC, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీలు, హోటల్ రంగానికి అనుకూల విధాన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా టూరిజం రంగంలో పెట్టుబడులను పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ చర్యలతో అరకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రకృతి పర్యాటక ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. టూరిజం–హాస్పిటాలిటీ–నైపుణ్యాభివృద్ధి రంగాల సమగ్ర ప్రోత్సాహంతో యువతకు కొత్త అవకాశాలు అందనున్నాయి.