మన ఆరోగ్యానికి పెరుగు మంచిదా….మజ్జిగ మంచిదా?

ప్రతిరోజు మన ఆహారంలో పెరుగు లేదా మజ్జిగ ను తీసుకోవడం సర్వసాధారణం. అయితే మన ఆరోగ్యానికి పెరుగు తినడం మంచిదా లేక మజ్జిగ తాగడం మంచిదా అన్న ప్రశ్న తలెత్తినప్పుడు రెండు ఆరోగ్యానికి మంచిదే అని చెప్పక తప్పదు. నిజానికి పెరుగు, మజ్జిగ రెండు పాల ఉత్పత్తుల్లో భాగమే. పాలను తోడబెట్టి పెరుగుగా మారుస్తారు పెరుగును చిలికితే మజ్జిగ తయారవుతుంది. కనుక పాలల్లో ఉండే
పోషక పదార్థాలు అన్నీ పెరుగు ,మజ్జిగలో కూడా ఉంటాయి. వాతావరణ పరిస్థితులు, మన ఆరోగ్య పరిస్థితులను బట్టి వీటిని తీసుకోవడంలో మార్పు చేసుకోవాలి అంతే. ఆ వివరాలంటే ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవికాలంలో అయితే మజ్జిగ తాగడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పెరుగుకు నీటిని జోడించి బాగా చిలికినప్పుడు ఇందులో ఉండే ప్రోటీన్స్,కొవ్వు పదార్థాలు విచ్ఛిన్నమవుతాయి.వీటిని మన శరీరం త్వరగా గ్రహించడంతో మన శరీరానికి అవసరమైన శక్తి లభించడంతోపాటు ,శరీరంలో నీటి శాతాన్ని పెంచి డిహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది.దీంతో అలసట నీరసం వంటి సమస్యలు తొలుగుతాయి.

బరువు తక్కువగా ఉండి ప్రోటీన్ లోపంతో బాధపడేవారు పెరుగును తినడమే మంచిది. పెరుగులో అత్యధిక ప్రోటీన్స్ లభిస్తాయి. మజ్జిగలో ప్రోటీన్స్ , కొవ్వు పదార్థం విచ్ఛిన్నమై ఉంటుంది. కావున తక్కువ బరువు ఉన్నవారికి ఇది సరిపోదు.
అతి బరువు, కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు మజ్జిగ తాగడం మంచిది. మజ్జిగలో ఉండే కొవ్వు పదార్థాలు విచ్ఛిన్నమై ఉంటాయి కాబట్టి వారి శరీరానికి హాని చెయ్యదు.

రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు మజ్జిగ తీసుకోవడం చాలా అవసరం. ఇందులోని లాక్టో బాసిల్లై ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, కార్బోహైడ్రేట్లు , లాక్టోస్ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణశక్తి తక్కువగా ఉండేవారు అత్యధిక ప్రోటీన్స్ ఉన్న పెరుగును రాత్రి పడుకునే టైంలో గ్యాస్ట్రిక్, ఉబ్బసం వంటి సమస్యలు తలెత్తి నిద్రలేమి సమస్యతో బాధపడాల్సి వస్తుంది. ఇలాంటివారు పలుచని మజ్జిగ తాగడమే మంచిది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడేవారు అత్యధిక కొవ్వు పదార్థాలు ఉన్న పెరుగును ఆహారంగా తీసుకోవడం కంటే మజ్జిగ తీసుకోవడమే మంచిది.