కర్ణాటక నుంచి ప్రకాశ్ రాజ్ – తెలంగాణ నుంచి దిల్ రాజు!

ఈసారి ఎలాగైనా కేంద్రంలో కీలకభూమిక పోషించాలని బలంగా ఫిక్సయిన బీఆరెస్… దానికోసం కలిసొచ్చే ప్రతీ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. దీంతో.. రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్న సినీ ప్రముఖులకు అవకాశాలు ఇస్తుందంట! ఇందులో భాగంగా… ప్రకాశ్ రాజ్ – దిల్ రాజు ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి!

అవును… ఈసారి అధికార బీఆర్ఎస్ నుంచి సినీ ప్రముఖులు పోటీచేసేందుకు రెడీ అయ్యారట. ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలను అత్యంత కొనియాడటంతోపాటు.. బీజేపీ అంటే అతెత్తున లేచే ప్రకాష్ రాజ్.. ఈసారి బీఆర్ఎస్ తరుఫున బరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. కర్ణాటక నుంచి ఎంపీ సీటుకి బీఆర్ఎస్ తరుఫున పోటీ చేయనున్నారంట!

ఇదే క్రమంలో… ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కూడా ఈసారి రాజకీయాల్లోకి రాబోతున్నారని, అందులో భాగంగా బీఆరెస్స్ నుంచి నిజమాబాద్ జిల్లా నర్సింగ్ పల్లి నుంచి పోటీచేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అలా కానిపక్షంలో.. రాజ్యసభ సీటు ఇచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

ఇటీవల “బలగం” ప్రమోషన్ లో భాగంగా కేటీఆర్ తో కలిసి సిరిసిల్లలో పర్యటించిన సందర్భంగా… ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ కేటీఆర్ పరోక్షంగా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో… దిల్ రాజు ఈ మధ్య కాలంలో తెలంగాణా ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిరిసిల్ల నేపథ్యంలో “బలగం” మూవీ కూడా రూపొందించారు. ఇక తన సొంత ఊరు నిజామాబాద్ లో వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం.. ప్రతి ఏటా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడం చేస్తున్నారు. ఫలితంగా దిల్ రాజు బాగానే ప్రజాదరణ పొందుతున్నాడని అంటున్నారు.

అన్నీ అనుకూలంగా జరిగితే… మరో నెలలోపు వీరి రాజకీయ రంగప్రవేశం – సీట్ల సర్ధుబాటు అంశాలపై క్లారిటీ రావొచ్చని తెలుస్తుంది!