దుబ్బాక ఉప ఎన్నికలు తెలంగాణ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. రెగ్యులర్ అసెంబ్లీ ఎన్నికల తరహాలో ప్రధాన పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నాయి. కేవలం ఒక్క స్థానానికి జరిగే ఎన్నికకు ఎందుకింత సీన్ అంటే కారణం ఉంది. ఈ ఎన్నికల తర్వాత వరుసగా ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు రానున్నాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు తప్పకుండా ఆ ఎన్నికల మీద ప్రభావం చూపుతాయి. పైగా ఈమధ్య తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గట్టిగా రాజకీయం చేస్తూ తాము బలపడ్డామని అంటున్నాయి. అందుకే ఎవరికి వారు ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుకోవాలని డిసైడ్ అయ్యారు.
అసలు కాంగ్రెస్, బీజేపీల కంటే తెరాసలో ఉప ఎన్నికల కంగారు ఎక్కువగా కనిపిస్తోంది. నోటిఫికేషన్ రాకముందు నుండి హరీష్ రావు నియోజకవర్గం మీద దృష్టి పెట్టడం, అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ తర్జన భర్జన వెరసి అధికార పార్టీలో ఇంత కంగారు ఎందుకు అనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగిస్తున్నాయి. నిజానికి దుబ్బాక తెరాస కంచుకోట. సోలిపేట రామలింగారెడ్డి నాయకత్వంలో టిఆర్ఎస్ చాలా బలపడింది. గత 16 ఏళ్లలో 2009 మినగా మిగతా అన్ని ఎన్నికల్లో తెరాసదే విజయం. పైపెచ్చు రామలింగారెడ్డి మరణించారనే సానుభూతి కూడ ఉంది. ఇన్ని అడ్వాంటేజెస్ పెట్టుకుని ఎలాంటి బెంగా లేకుండా ఎన్నికలకు వెళ్లాల్సిన టిఆర్ఎస్ కంగారుపడిపోతూ పరుగులెత్తుతోంది.
వారి హడావుడి చూస్తున దుబ్బాక ఓటర్లు కేసీఆర్, హరీష్ రావులు ఇంతలా హైరానా పడుతున్నారంటే కొంపదీసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఏదో ఒకటి ఈ స్థానంలో పాగా వేయదు కదా, ఒకవేళ టిఆర్ఎస్ గెలిచినా బొటాబొటీ మెజారిటీ తప్ప భారీస్థాయిలో రాదేమో అనుకుంటున్నారు. ఈ తరహా అనుమానాలు తెరాసకే నష్టం కలిగిస్తాయి. అనవసరంగా ప్రజల దృష్టిని కాంగ్రెస్, బీజేపీల మీదకు మళ్లించి, వాటికి హైప్ పెంచిన క్రెడిట్ కేసీఆర్, హరీష్ రావులదే అవుతుంది. ఒక్కోసారి ఈ మార్పులే ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే ప్రమాదం ఉంటుంది. కనుక కేసీఆర్ ఇప్పటికైనా కంగారుపడటం తగ్గించి ధీమాగా పనిచేసుకుంటూ వెళ్లడం మంచిది.