జనసేనను దునిమేసిన జగన్మోహన్ రెడ్డి! 

YS Jagan And Pawan Kalyan
రాజకీయశత్రువును నిర్జించాలంటే మనం  ప్రత్యేకంగా  గొయ్యి తీసి పాతిపెట్టాల్సిన పని లేదు.  తన గొయ్యిని తాను తవ్వుకునేలా చేస్తే చాలు…మదించి ఘీంకారం చేస్తూ  దారి పొడవునా చెట్లను కొమ్మలను కూల్చేస్తూ విశృంఖలంగా ప్రవర్తించే మత్తేభం సైతం అడవిలో వేటగాళ్లు తవ్విన  గొయ్యి మీద కప్పిన ఆకులను, కొమ్మలను గమనించకుండా ఒక్కసారిగా గోతిలో పడిపోతుంది.  
YS Jagan And Pawan Kalyan
YS Jagan And Pawan Kalyan

ఊహకు అందని జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజనీతిశాస్త్రాన్ని ఎక్కడ చదివాడో తెలియదు.  అసలు చదివాడో లేదో తెలియదు కానీ, ఆయన అమలు చేస్తున్న రాజనీతిని ఒకసారి పరిశీలిస్తే కొమ్ములు తిరిగిన రాజనీతివేత్తలు కూడా ముక్కున వేలు వేసుకోవాల్సిందే!  అంతలావు చంద్రబాబును ఒక్కదెబ్బతో కుదేలు చేసి, కేవలం మూడుగ్రామాలకు పరిమితం చేసి, ఢిల్లీలో చోటు లేకుండా చేసి, తెలంగాణాలో ఆరుమాసాలనుంచి అజ్ఞాతవాసం చేసేలా చేసి,  తన అపరాధాలకు తానే పొగిలిపొగిలి ఏడ్చేలా చేసిన జగన్మోహన్ రెడ్డి అదేరకమైన అస్త్రాన్ని మరొక రాజకీయ శత్రువు పవన్ కళ్యాణ్ మీద కూడా ప్రయోగించి వెండితెరపై వందలకోట్లు కురిపించే అగ్ర కథానాయకుడిని రాజకీయవేదికమీద అర్ధరూపాయికి కూడా చెల్లకుండా చేయడం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహరచనాచమత్కృతిని  అంచనా వెయ్యడం సామాన్యులకే కాదు…జుట్టునెరిసిన ఖర్వాటులకు కూడా సాధ్యం కాదేమో?  

చిరంజీవే చతికిలపడ్డాడు 

సినిమారంగపు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి మొదటి సారి ఎన్నికల్లోనే పద్దెనిమిది సీట్లు గెల్చుకుని, ఎన్టీఆర్ వలె నేరుగా ముఖ్యమంత్రి అయిపోవాలనే మహత్వకాంక్ష నెరవేరక, నిరాశతో కృంగిపోయి, దుకాణాన్ని ఎప్పుడెప్పుడు మూసేద్దామా అని తహతహలాడిపోయి, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తన దుకాణాన్ని టోకుగా సోనియాగాంధీ చరణకమలాల ముందు సమర్పించుకుని, ఆ తరువాత ఆమె విదిలించిన ఎంగిలిమెతుకును పంచదార పొంగలిలా స్వీకరించి, తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం చెంది అధికారాన్ని కోల్పోవడంతో అధికారకన్యావిరహవేదనను ఏమాత్రం ఓపలేక,  జేబులో సొమ్మును ఖర్చు చెయ్యడానికి మనసొప్పక,  రాజకీయాలకు శుభం కార్డు వేసుకుని నేడు అటు కేసీఆర్, ఇటు జగన్ దృష్టిలో పడితే అదే మహాభాగ్యం అనే రీతిలో అప్పుడప్పుడు ఏదొక సాకుతో వారి దర్శన భాగ్యం పొందుతూ,   సినిమాలు చేసుకుంటూ జీవిస్తున్నాడు.  ఆయన సోదరుడిగా సంప్రాప్తి౦చిన వెండితెర వైభోగాన్ని అనుభవిస్తూ అన్నయ్య సాధించలేని రాజ్యాన్ని తాను సాధించే కోరికతో  జనసేన అనే మరొక దుకాణాన్ని అట్టహాసంగా తెరిచాడు.   

సినిమా జిమ్మిక్కులు రాజకీయాల్లో చెల్లవు 

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.  ఎన్నికల్లో పోటీ చెయ్యవచ్చు.  గెలవచ్చు…అధికారాన్ని చేపట్టవచ్చు.  మన రాజ్యాంగం ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ అలాంటి ప్రజాస్వామిక హక్కును ప్రసాదించింది.  అయితే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది కేవలం చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చెయ్యడం, జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడం కోసమే అనే రహస్య అజెండా ఆ పార్టీలో చేరిన కొందరు నాయకులకు, కార్యకర్తలు, అభిమానులకు తెలియదు.  చంద్రబాబు నుంచి భారీ ప్యాకేజి పవన్ కళ్యాణ్ కు అందుతుందని అందరికీ సందేహాలే.  “పవన్ కళ్యాణ్ మా దగ్గర ఆరువందల కోట్ల రూపాయలు తీసుకుని మద్దతు ఇచ్చాడు” అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బహిరంగంగానే ప్రకటించాడు.  తన అశేష అభిమానులను చిరంజీవి ఎలా మోసం చేశాడో పవన్ కళ్యాణ్ కూడా అలాగే మోసం చేస్తూ చంద్రబాబు నాయుడుకు భజన చేస్తూ జనసేనను భజనసేనను చేసి అపహాస్యం పాలయ్యాడు.  ఫలితంగా ఎవ్వరూ కనీ వినీ ఎరుగని ఘోరాతిఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుని రాజకీయరంగంలో జోకర్ గా తేలిపోయేడు!     ముఖ్యమంత్రి కావాలనుకున్న కథానాయకుడిని కనీసం అసెంబ్లీలో కాలు కూడా పెట్టకుండా జనం తరిమేసిన తీరును గమనిస్తే సినిమా వ్యామోహానికి – వాస్తవ రాజకీయాలకు మధ్యగల లక్ష్మణరేఖను ప్రజలు గుర్తించారని నిర్ధారించవచ్చు.  

అధికారమే పరమావధి 

ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీతో సంబంధాలు తెంచుకోవడం, ఒంటరిగా పోటీ చేసి ఎడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలా రాజకీయపుటాశలు చెల్లాచెదురై పోవడంతో కొంతకాలం పాటు ఆత్మవిమర్శ చేసుకోవడం, చేసిన తప్పులు దిద్దుకోవడం, ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నించడం లాంటివేమీ చెయ్యకుండా  జగన్మోహన్ రెడ్డిని అసభ్యపదజాలంతో దూషించడమే రాజకీయంగా భావిస్తున్న పవన్ కళ్యాణ్ జగన్ పాలనాతీరు చూసి ఇక రాజకీయరంగంలో తనకు నూకలు చెల్లినట్లే అని విశ్వసించి మళ్ళీ తనదైన సినిమారంగంలోకి వెళ్ళిపోయాడు.  “పాతికేళ్ల రాజకీయం మాది,  ఇక సినిమాలు చెయ్యను” ప్రగల్భాలు పలికిన పవన్ పాతిక నెలలు కూడా అధికారం లేకుండా జీవించలేకపోయాడు.    ఆనాడు చిరంజీవి చేసిన ఘోరతప్పిదాలనే తాను కూడా చేస్తూ తమ లక్ష్యం  అధికారదాహమే తప్ప ప్రజాసేవ కానేకాదని తేల్చిపారేశారు! 

బీజేపీతో మనసులేని మనువు 

ఒకనాడు చంద్రబాబుతో చేరి మోడీని ఇష్టం వచ్చినట్లు దూషించిన పవన్ కళ్యాణ్  ఎన్నికల్లో సున్నం అయిపోగానే  తన ఉనికి కోసం మోడీ పాదాలను ఆశ్రయించి పరువు పోగొట్టుకున్నాడు.  బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కనీసం జగన్ నుంచి రక్షణ దొరుకుతుందని భ్రమించాడు.  అయితే జగన్మోహన్ రెడ్డి మేధస్సును తక్కువ అంచనా వేశాడు పవన్ కళ్యాణ్.  వీవీ లక్ష్మీనారాయణ అనే అధికారి తన పదవికే కళంకం తెస్తూ జగన్మోహన్ రెడ్డి మీద బనాయించిన అక్రమ కేసులను వాస్తవాలుగా భ్రమించి అందుకు జగన్ కు జీవితఖైదు విధిస్తారని వెర్రి భ్రాంతికి గురై బీజేపీతో చేరిపోయి ఏదో ప్రభావం చూపవచ్చని ఆశించిన పవన్ వ్యూహాలను పసిగట్టి,  తనకున్న పార్లమెంట్ సభ్యుల బలం,  పాలనాసామర్ధ్యం, అవినీతిరహిత ప్రభుత్వ గమనం, ఆధునిక ఆలోచనావిధానం, పోరాటతత్వం, వాదనాపటిమ మొదలైన విశేషాలతో దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా విఖ్యాతుడైన జగన్మోహన్ రెడ్డి మోడీ, అమిత్ షా లను అఆకట్టుకోవడంలో వింత ఏముంది?  బీజేపీ, వైసిపి మధ్యన సరికొత్త మైత్రి చిగురించింది అనే విషయం ఏనాడో అందరికీ అర్ధం అయింది.  బీజేపీతో మైత్రిని పెట్టుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ ను సమర్ధవంతంగా బీజేపీ పరిష్వంగం నుంచి దూరం చెయ్యడంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ కథ ముగిసిపోయింది.  హాయిగా తెలంగాణాలో స్థిరపడిపోయి, ఫార్మ్ హౌస్ ను చూసుకుంటూ, సినిమాకథలు వింటూ, కరోనా కాలంలో కానీ, వరదలకాలంలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టే సాహసం కూడా చెయ్యలేకపోయాడంటే ఆ చాతుర్యం అంతా జగన్మోహన్ రెడ్డిదే!   

భవిష్యత్తు అంధకారమే 

పవన్ కళ్యాణ్ ను జగన్ ఏనాడూ నేరుగా విమర్శించలేదు.  ఎపుడో ఒకసారి పవన్ ముగ్గురు భార్యల గూర్చి చిన్న కామెంట్ చేశాడు.  దాన్ని ఏదో రచ్చ చెయ్యాలని తెలుగుదేశం, జనసేనలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.  పవన్ కళ్యాణ్ కు ఇక రాజకీయభవిష్యత్తు ఉన్నదని ఎవరైనా నమ్మితే వారిపట్ల జాలి చూపడం తప్ప ఎవరేమీ చెయ్యలేరు.  తన తెలివితక్కువతనానికి, తన అవివేకవ్యూహాలకు, తన నోటిదురుసుతనానికి చిరంజీవి కన్నా భారీమూల్యాన్ని చెల్లించుకుని,  రాజకీయాల్లో చెల్లని కాసుగా మిగిలిపోవడం కేవలం స్వయంకృతం.  చంద్రబాబు లాంటి నలభై ఏళ్ల అనుభవజ్ఞుడే జగన్ విరాట్స్వరూపం ముందు మోకరిల్లక తప్పలేదు.  ఇక పవన్ కళ్యాణ్ ఎంత?  
 
ధైర్యము, ప్రయత్నము, తన విధిని తాను నిర్వర్తించడం,
మేలును మరువకపోవడం, దురదృష్టానికి నిస్పృహ చెందకుండా ఉండటం… 
ఈ లక్షణాలు కలిగినవారినే అదృష్టదేవత వరిస్తుంది అంటారు పంచతంత్ర కర్త విష్ణుశర్మ.   
 
పవన్, చిరంజీవి లో పై లక్షణం ఒక్కటీ లేదు.  అందుకే వారు రాజకీయాల్లో రాణించలేకపోయారు.  అదృష్టదేవత వారికి దూరం పాటిస్తున్నది! 
 
వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలలో పై లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.  అందుకే వారు ఒకసారి దెబ్బతిన్నప్పటికీ, పట్టు వదలక కృషి చెయ్యడంతో అదృష్టదేవత వారి కంఠసీమను అలంకరించింది.  
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు