కేటిఆర్ సార్ నా స్నేహితుడు చనిపోయాడు.. ఏం చేయమంటారు

హైదరాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రుల తీరుపై సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ (మహానటి డైరెక్టర్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి తీరుతో తన స్నేహితుడిని కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కెమెరామెన్ గా పని చేస్తున్న అశ్విన్ స్నేహితుడు గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆయనను గాంధీ ఆసుప్రతికి తరలించారు. అయితే, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆయన మరణించాడు. ఈ అంశంపై మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ జరిగిన దారుణాన్ని అశ్విన్ వివరించారు.

‘ప్రమాదం జరిగిన వెంటనే నా స్నేహితుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మూడు గంటల పాటు అతను చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. ఆదివారం కావడంతో డాక్టర్లు అందుబాటులో లేరు. అతని తల్లిదండ్రులే అతన్ని స్ట్రెచర్ పై పడుకోబెట్టి… అటు, ఇటు మోసుకుంటూ తిరిగారు. గాంధీ ఆసుపత్రికి కాకుండా మరే ఆసుపత్రికి తీసుకెళ్లినా అతను బతికేవాడు. రాజధాని నగరమైన హైదరాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రిలో మనుషుల ప్రాణాలను ఎందుకు కాపాడుకోలేక పోతున్నాం?

కేటీఆర్ సార్.. ప్రభుత్వాసుపత్రి చావులకు, నిర్లక్ష్యానికి పర్యాయపదం కాదని చెప్పడానికి ఏం చేయమంటారు? వైద్యం అందక చనిపోయిన నా స్నేహితుడు రాష్ట్రంలోనే గొప్ప కెమెరామెన్. దీనిపై ఎవరిని ప్రశ్నించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. వైద్యం అందక ఎవరూ చనిపోరాదు’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

అశ్విన్ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. ఇది చాలా బాధాకరమైన విషయమని, అయితే, ఆసుపత్రికి తీసుకొచ్చే సరికే అతడి పరిస్థితి విషమంగా ఉందని సిబ్బంది తనతో చెప్పారని కేటీఆర్ పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ మన ఆసుపత్రుల్లో ఎన్నో మార్పులు చేయాల్సి ఉందని, ఇకపై దీనికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు.  మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి సానుభూతి తెలిపారు.