హిందూపురం లోక్ సభ సీటు.! వైఎస్ జగన్‌కి వేరే ఆప్షన్ లేదా.?

ఆమె ఎవరో ఎవరికీ తెలియదు.! కానీ, అనూహ్యంగా వైసీపీలో చేరారు. ఏకంగా హిందూపురం లోక్ సభ నియోజకవర్గ వైసీపీగా ఎంపికైపోయారు. ఆమె వైసీపీలో చేరడమే అనూహ్యం. అసలు ఎవరామె.? కర్నాటక మాజీ మంత్రి శ్రీరాములు సోదరి ఆమె. పేరేమో జోలదరాశి శాంత.

ప్రస్తుతం హిందూపురం వైసీపీ ఎంపీగా పనిచేస్తున్నారు గోరంట్ల మాధవ్. అంతకు ముందు ఆయన పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహించేవారు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో గొడవ కారణంగా గోరంట్ల మాధవ్ రాత్రికి రాత్రి రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు అప్పట్లో.

ఉద్యోగానికి రాజీనామా చేయడం, వైసీపీలో చేరడం, చేరుతూనే టిక్కెట్ దక్కించుకోవడం.. ఈ క్రమంలో నడిచిన హైడ్రామా అందరికీ తెలిసిన విషయాలే. అంతకు మించిన అనూహ్యమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు వైసీపీ హిందూపురం లోక్ సభ తాజా అభ్యర్థి శాంత ఎంపిక వ్యవహారం.

ఏ ప్రతిపాదికన శాంత, వైసీపీ హిందూపురం లోక్ సభ అభ్యర్థిగా ఎంపికయ్యారో స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలకే అర్థం కాని పరిస్థితి. సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్, రాజకీయాల్లోకి వచ్చాక బీభత్సమైన నెట్‌వర్క్ క్రియేట్ చేసుకున్నారు.

అనుచరగణం, ఆ హంగామా.. అది వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు.. ఇక, గోరంట్ల మాధవ్ అనగానే, ‘న్యూడ్ ఫోన్ కాల్’ వ్యవహారం అందరికీ గుర్తుకొస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబుపైనా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీదా బూతులతో విరుచుకుపడిపోవడం గోరంట్ల మాధవ్ ప్రత్యేకత. అలాంటి గోరంట్ల మాధవ్‌ని కాదని, ‘శాంత’ వైపు వైఎస్ జగన్ ఎందుకు మొగ్గు చూపారో ఏమోగానీ, ఇది ఖచ్చితంగా ఓడిపోయే సీటు.. అని వైసీపీలోనే చర్చ జరుగుతోంది.