నాలుగేళ్ళకోసారి ఆయనలా భార్యల్ని మార్చలేం: వైఎస్ జగన్.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మరోసారి తీవ్రస్థాయి విమర్శలు చేశారు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అమ్మ ఒడి కార్యక్రమం కింద నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్, ‘ఆయనలా ప్రతి నాలుగేళ్ళకోసారి భార్యల్ని మార్చలేం..’ అంటూ పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘వారాహి’ అనే లారీ మీద యాత్రలు చేస్తున్న ప్యాకేజీ స్టార్, దత్త పుత్రుడు.. బూతులు మాట్లాడుతున్నారంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పేరు మాత్రం షరా మామూలుగానే ప్రస్తావించలేదు వైఎస్ జగన్.

అయినా, చిన్న పిల్లలకు సంబంధించిన అమ్మ ఒడి కార్యక్రమంలో పెళ్ళిళ్ళు, భార్యలు.. విడాకులు.. భార్యల్ని మార్చడం, బూతులు మాట్లాడడం.. వంటి ప్రస్తావనలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకు రావడమేంటి.?

నిజానికి, ఈ విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా.? లేదంటే, ఆయనే స్వతాహాగా అత్యుత్సాహం చూపుతున్నారా.? అన్న విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ మీద ఈ తరహా విమర్శలు చేయడానికి వైసీపీలో కింది స్థాయి నాయకులు సరిపోతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికారిక వేదికలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పుడు సంకేతాల్ని పంపుతుందనడం నిస్సందేహం.

అయితే, వైఎస్ జగన్ వ్యాఖ్యల్ని వైసీపీ సోషల్ మీడియా విభాగం సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ – జనసేన మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జోరుగా సాగుతోంది.