ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డీలా పడ్డారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఓ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విపక్షాలపై ఘాటైన విమర్శలు చేయకపోవడంతో టీడీపీ, జనసేన ఒకింత ఓవరాక్షన్ చేశాయి. కానీ, సీన్ మారింది. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సహజ శైలిలో మళ్ళీ సెటైర్లు షురూ చేశారు.
తాజాగా వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్ మీద సెటైర్లేశారు. ‘ముసలాయన..’ అంటూ విరుచుకుపడ్డారు. ‘ముసలాయన..’ అంటూ వైఎస్ జగన్ చేసిన విమర్శల మీద కొంత మేర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. సెల్ఫీ ఛాలెంజ్ మీద జగన్ వేసిన సెటైర్లు గట్టిగా పేలుతున్నాయ్.
‘సగం కట్టి వదిలేశారు చంద్రబాబు.. మేం, వాటిని పూర్తి చేస్తున్నాం. మేం పూర్తి చేసిన టిడ్కో ఇళ్ళ దగ్గరకు వెళ్ళి సెల్ఫీలు తీసి పెడుతున్నారు.. చేతనైతే, మాలా గడప గడపకూ వెళ్ళండి.. మీ హయాంలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చారో చెప్పి చూడండి..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సవాల్ విసిరారు.
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపైనా, దుష్ట చతుష్టయమంటూ రాజకీయ, మీడియా ప్రత్యర్థులపైనా వైఎస్ జగన్ తన ట్రేడ్ మార్క్ సెటైర్ల వర్షం కురిపించారు. దాంతో, వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది.
ఇంకో ఏడాది లోపే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన దరిమిలా, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీడీపీ పాదయాత్రలు, అధికార పక్షం.. అధికారిక బహిరంగ సభలు ఓ వైపు, ‘నువ్వే మా నమ్మకం జగనన్న’ కార్యక్రమాలతో ఇంకో వైపు.. పొలిటికల్ జోరు ప్రదర్శిస్తున్నాయి.