నానాటికి ఎన్నికలు చాలా ఖరీదైపోతున్నాయి. ధనవంతులు కూడా ఎన్నికల్లో పోటీ చేయటానికి భయపడే రోజులు వచ్చేశాయి. గడచిన మూడు ఎన్నికలుగా ఎన్నికల వ్యయం అంతకంతకు పెరిగిపోతోండటమే అందుకు కారణం. రాబోయే ఎన్నికల్లో పోటీ పడుతున్న వివిధ పార్టీల అభ్యర్ధుల్లో చాలామంది కోటీశ్వరులే కావటం గమనార్హం. మొత్తం అభ్యర్ధుల్లో సుమారుగా ఏ 70 మంది అభ్యర్ధుల ఆస్తులు వందల కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. వీళ్ళంతా సీజన్ డు రాజకీయానేతలు మాత్రమే కాదు. వందల కోట్లలో వ్యాపారాలు చేస్తున్నవారు, పెద్ద పారిశ్రామికవేత్తలున్నారు.
వందలు, వేల కోట్ల రూపాయల వ్యాపారాలున్న వారినే పార్టీలు ఎన్నికల్లో పోటీకి నిలబెడుతున్న కారణంగా వ్యయం కూడా అదే స్ధాయిలో పెరిగిపోతోంది. ఇక ప్రస్తుతానికి వస్తే చంద్రబాబునాయుడు, నారాయణ, రఘురామకృష్ణం రాజు, గల్లా జయదేవ్, శ్రీ భరత్, నారా లోకేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళు చాలామందున్నారు.
చంద్రబాబు, భార్య భువనేశ్వరి ఆస్తులు దాదాపు 700 కోట్ల రూపాయలు. మంత్రి నారాయణ ఆస్తులు రూ 650 కోట్లు, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు రూ 339 కోట్లు, వైసిపి అభ్యర్ధి రఘురామ కృష్ణంరాజు ఆస్తులు రూ 324 కోట్లు, టిడిపి విశాఖపట్నం ఎంపి అభ్యర్ధి భరత్ ఆస్తులు రూ 200 కోట్లు, గుంటూరు టిడిపి ఎంపి గల్లా జయదేవ్ ఆస్తులు సుమారు రూ. 250 కోట్లు…ఇలా చెప్పుకుంటూ పోతే వందల కోట్ల రూపాయల ఆస్తులున్న అభ్యర్ధులు చాలామందే ఉన్నారు.
ఏరి కోరి డబ్బున్న వాళ్ళకు టికెట్లు ఇవ్వటానికే పార్టీలు ఎక్కువగా మొగ్గు చూపుతున్న కారణంగా ఎన్నికల వ్యయం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఎన్నికల కమీషన్ లెక్కల ప్రకారమే దేశంలో అత్యధిక ఎన్నికల వ్యయం అయ్యే రాష్ట్రాల్లో ఏపి ముందుంది. ఓటుకు రూ 10 వేలు ఇవ్వటం, మొబైల్ ఫోన్లు పంపిణీ చేయటం, లేదంటే టివిలు, గ్రౌండర్లు లాంటి ఖరీదైన వస్తువులు ఇచ్చి ఓట్లేయించుకోవాలని అభ్యర్ధులు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల వ్యయం పెరిగిపోతుండటానికి ఏ ఒక్క పార్టీనో తప్పుపట్టేందుకు లేదులేండి. అన్నీ పార్టీలు పోటీపడే వ్యయాన్ని పెంచేస్తున్నాయి.
