జగన్ ‘కాపు కోటా’మాట ఎందుకు మారింది? : ముద్రగడ చెబుతున్న రహస్యం

రాష్ట్ర రాజకీయాలలో ఎవరూ అనుకోనిది జరిగింది. ఇన్నాళ్లు, వైసిసి ఏజంటని, వైసిసి అజండా ప్రకారం ఆయన నడుచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద పోరాటం చేస్తున్నారని అపకీర్తి పొందిన కాపు రిజర్వేషన్ పోరాట నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అదే వైసిపి నేత మీద మండిపడ్డారు.

కారణం, కాపు రిజర్వేషన్ల మీద వైసిపి నేత జగనోహన్ రెడ్డి తన వైఖరి స్పష్టం చేసి కాపు రిజర్వేషన్లు నా చేత కాదన్నారు. ఇది చాలా మంది కాపులకు ఆగ్రహం తెప్పించింది.  గతంలో ఆయన చాలా సార్టు కాపుల  రిజర్వేషన్ల ఉద్యమాన్ని సమర్థించారు.  

రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేస్తున్నపోరాటాన్ని సమర్థించారు. ఈ వీడియోలో జగన్ స్పష్ష్టంగా కాపు రిజర్వేషన్ల మీద ఏమన్నారో కనిపిస్తుంది.

 

ముద్రగడను తెలుగుదేశం ప్రభుత్వం కిర్లంపూడిలో హౌస్ అరెస్టు చేసినపుడు మద్దతు తెలిపారు. కాపులకు రిజర్వేషన్లు కావాలని ఆందోళన జరుగుతున్నపుడు జగన్ఒక్క సారి కూడా తనకు ఈ విషయంలో తనకు ‘రిజర్వేషన్’ ఉందని ఎపుడు చెప్పలేదు. సరిగదా తాను అధికారంలోకి వస్తే కాపులను బిసిలో చేరుస్తాననే ధోరణిలోనే మాట్లాడారు. దీనితో కాపులు జగన్ ని నమ్మారు.

అందువల్ల ఇపుడు జగన్ ఒక్క సారి కాపు రిజర్వేషన్లలో తానే మీ చేయలేనని, అది కేంద్రం పరిధిలోని అంశమని, ఇలాంటి దాని మీద మాట ఇచ్చి మళ్లీ వెనక్కు పోవడం తాను చేయలేనని  అన్నారు.  మాట ఇస్తే చేస్తా చేస్తారని, చేసే పనులకే తాను హామీ ఇస్తానని జగన్ అనడం ముద్రగడను నొప్పించింది.

జగన్ ప్రకటన వెనక ఏమైనా రాజకీయాలున్నాయా.   ఉన్నాయంటున్నారు ముద్రగడ. ఏమిటది?

ప్రజా సంకల్పయాత్రంలో జగన్ కు  నేను రేడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించాలని జగన్ తన అనుచరులతో కబురు పంపారు. కాపు జాతికి జగన్ ఏంచేసాడని స్వాగతం పలకాలినేను.  ఆ ఉక్రోషంతోనే జగన్ కాపు జాతిని అవమానించారు. అందుకే ఆయన కాపు రిజర్వేషన్లు కాదుపొమ్మంటున్నారు.

 

అందుకే  తాను  ఆగ్రహం వ్యక్తం చేేస్తున్నానని ఆయన ప్రకటించారు. 

అంతే కాదు, వైసిపికి బాగా నష్టం కల్గించేలా మాట్లాడారు. ముద్రగడ మాట ప్రభావం కాపు వోట్ల మీద తప్పక ఉండే అవకాశం ఉంది. రిజర్వేషన్ల విషయంలో కాపులు రెండుగా విడిపోయారని, ఒక వర్గం తెలుగుదేశంతో, మరొక వర్గం వైసిపితో ఉందని అనుకున్నారు.

ఇపుడు జనసేన పార్టీ జనంలోకి వచ్చింది. జనసేన నేత  వపన్ కల్యాణ్ జనంలోకి వస్తున్నారు కాపునినాదం మీద రాజకీయ పార్టీ  ఏర్పాటుచేయకపోయినా, పవన్ ని కాపు యువకులు సొంతం చేసుకుంటున్నారు. ఇలాంటపుడు జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ల నుంచి దూరం జరిగారు. ఆయన ప్రకటన వల్ల ఒకటి స్పష్టం: కాపు రిజర్వేషన్లు సాధ్యం కావు. కాపు రిజర్వేన్లలో  రాష్ట్రం  చేసేదేమీ లేదని ఆయన అన్నారు. దీని మీద  ముద్రగడ స్పందన చాలా తీవ్రంగా ఉంది. ఇది కాపులను వైసిపి నుంచి దూరం చేస్తుందనడంలో ఆశ్చర్యం లేదు.  ముద్రగడ ఏం చేప్పారో చూస్తే ఇది స్పష్టమవుతుంది. ముద్రగడ జగన్ ప్రకటనకు తుని పట్టణంలోఆదివారం నాడు  ఎలా స్పందించారో చూడండి.

 

 

  1. జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ కాపు రిజర్యేషన్‌లకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీలోనూ మద్దతు పలికారు. ఇప్పుడు రాష్ట్ర పరిధిలో అంశం కాదని, మీరు యూటర్న్ తీసుకోవడం బాధాకరం.
  2. కాపులు ఎప్పుడూ మీ మోచేతి నీళ్ళు తాగుతూ మీ పల్లకీలే మోస్తూ ఉండాలా? 
  3. కాపుల ఉద్యమం పుట్టిన గడ్డమీదే జగన్ కాపులను అవమానించడం దుర్మార్గం. మా జాతిపై మీకు చిన్నచూపెందుకో చెప్పాలి.
  4. మా జాతి ఏం తప్పు చేసిందో మీరు చెప్పాలి.
  5. కాపు రిజర్యేషన్లతో రాష్ట్రానికి సంబంధం లేకపోతే… కేంద్రం పరిధిలో ఉన్న అనేక విషయాలపై మీరు ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు.
  6. గత ఆరునెలలుగా జగన్ పాదయాత్రలో ఇస్తున్న హామీలకు రాష్ట్ర, కేంద్ర బడ్జెట్‌లు సరిపోతాయా?
  7. పదవీ కాంక్షతో మీరు ఇలాంటి హామీలు ఇవ్వొచ్చు కానీ.. కాపు జాతికి రిజర్యేషన్ ఇవ్వలేరా?
  8. కాపు జాతి ఓట్లు అడిగే అర్హత జగన్‌కు లేదు. వైసీపీ తరఫున కాపు జాతికి టికెట్లు కూడా ఇవ్వొద్దు.
  9. ఒక్కొక్క నియోజక వర్గంలో కాపు జాతి సోదరులను ముగ్గురిని ఎగదోస్తూ, వాళ్ళతో లక్షల రూపాయలు ఖర్చు చేయిస్తున్నారు.
  10.  జగన్ తన పాదయాత్రకు ప్రజలను తరలించడానికీ, ప్లెక్సీలు కట్టడానికి కాపు జాతి సోదరులు ఆస్తులు ఖర్చు చేసుకుంటున్నారు.  
  11. జగన్ వల్ల కాపు రాజకీయనేతల జీవితాలు, కుటుంబాలు నాశనమయిపోతున్నాయి.
  12. రెట్టింపు నిధులిస్తానంటూ మాపై సవతి తల్లి ప్రేమ చూపొద్దు.
  13. జగన్ కాపు జాతిని ఈ విధంగా కించపరచడం చాలా పెద్ద తప్పు.
  14. కుటుంబంపై నిన్న జగన్ దొంగ ప్రేమ, మొసలి కన్నీరు కార్చారు. జగన్ దొంగ ప్రేమ తనకక్కర్లేదు, నా జాతి ప్రయోజనాలే నాకు  ముఖ్యం.
  15. ‘కాపు రిజర్వేషన్లు మీ పరిధిలో లేవన్నారు. ఇక మీ పల్లకీ మొయ్యేలేం. మా జాతికి రిజర్యేషన్ ఇచ్చేవాళ్ళ పల్లకీనే మోస్తాం.