వై నాట్ 175: టీడీపీ, జనసేన పార్టీలో ‘పొత్తు’ కదలిక.?

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా తెనాలిలో, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీపై దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. పనిలో పనిగా దత్త పుత్రుడంటూ షరామామూలుగానే ‘జనసేన అధినేత’ పవన్ కళ్యాణ్ మీదా రుసరుసలాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

టీడీపీ – జనసేన కలిసి వస్తాయా.? విడివిడిగా పోటీ చేస్తాయా.? అన్నదానిపై వైసీపీలో కొంత గందరగోళం వుంది. ‘వై నాట్ 175’ అన్న మాటకే వైసీపీ కట్టుబడి వున్నప్పుడు, టీడీపీ – జనసేన కలిస్తే ఏంటి.? కలవకపోతే ఏంటి.? కానీ, ఎక్కడో ఏదో అనుమానం వైసీపీలో వున్నట్టుంది. దాన్ని క్లియర్ చేసుకోవడానికే, ‘బస్తీ మే సవాల్.. దమ్ముంటే.. ధైర్యముంటే విడివిడిగా పోటీ చేయండి..’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అల్టిమేటం జారీ చేస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులకి. టీడీపీ ఈ విషయమై పెదవి విప్పడంలేదు. జనసేన కూడా వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.

దాంతో, వైసీపీలో టెన్షన్ మరింత పెరుగుతోంది. అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, టీడీపీ నుంచి ముఖ్య నేతల బృందమొకటి, జనసేన అధినేతను హైద్రాబాద్‌లో కలిసేందుకు ప్రయత్నిస్తోందట. అది ఓ సినిమా షూటింగ్‌ స్పాట్‌లో అని తెలుస్తోంది. టీడీపీలో వున్న సినీ రంగానికి చెందిన బ్యాచ్ ఈ మంతనాలకు లీడ్ తీసుకుందని సమాచారం. సినిమా ముచ్చట్ల కోసం వెళ్ళి, రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టుకుని వస్తారట. రేపో మాపో ఈ అంశంపై పూర్తి స్పష్టత రాబోతోందిట. దీన్ని ‘పొత్తు కదలిక’లా భావించొచ్చా.?