జగన్ మనసు గెలుచుకున్న విశాఖ ఎంపీ ఎంవీవీ.!

కొద్ది రోజుల క్రితం విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు కిడ్నాప్‌కి గురైన ఘటన, విశాఖలోనే కాదు.. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో పెను దుమారానికి కారణమైంది. ‘విశాఖలో ఇకపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యను.. హైద్రాబాద్‌లోనే చేసుకుంటాను..’ అని ఆ ఘటనతో ఎంవీవీ సత్యనారాయణ ప్రకటించేశారు.

ఆ వ్యవహారం వైసీపీలో మరింత కలకలానికి కారణమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా వార్నింగ్ ఇవ్వడంతో ఎంవీవీ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. మరోపక్క, వారాహి విజయ యాత్ర సందర్భంగా, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.

అదే ఎంవీవీ సత్యనారాయణకి బాగా కలిసొచ్చింది. సందర్భాన్ని బాగా వినియోగించుకున్నారాయన. పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయి విమర్శలు చేశారు ఎంవీవీ. అంతకుముందెప్పుడూ ఎంవీవీ ఇంత తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు ఎవరి మీదా చేయలేదు.

పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకి కౌంటర్ ఎటాక్ గట్టిగా ఇచ్చారంటూ ఎంవీవీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశంసలు కురిపించారట. ఆ వెంటనే, ఎంవీవీ కొత్త ఉత్సాహంతో, తన మీద విశాఖ లోక్‌సభ నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

జస్ట్ కొన్ని రోజుల వ్యవధిలోనే, ఎంవీవీ గ్రాఫ్ కాస్త బెటర్ అయ్యిందన్నది స్థానికంగా వినిపిస్తున్నమాట. అయితే, ఇదంతా వైసీపీ ఆయన పట్ల చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ అనుకోవాలా.? నిజంగానే, ఎంవీవీ మారారా.? సొంత పార్టీ కార్యకర్తల దృష్టిలోనూ నెగెటివ్ మార్క్స్ వేయించుకున్న ఎంపీ ఎంవీవీ, ఇలా ఎలా పాజిటివ్ అప్రోచ్ సంపాదించుకోగలిగినట్టు.?