ఒక్క రజనీతో బాబు రెండు స్కెచ్ లు!

తాజాగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సభావేదికపై ప్రసంగించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. నాడు ఎన్టీఆర్ ని గద్దె దింపిన సమయంలో చంద్రబాబుకు రజనీకాంత్ మద్దతు తెలిపారని.. ఇప్పుడేమో ఎన్టీఆర్ పై ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నారని వైసీపీ నేతలు “టార్గెట్ రజనీ” ని స్టార్ట్ చేశారు. ఆ సంగతి అలా ఉంటే… తాజాగా తెలుగు రాజకీయ తెరపైకి రజనీని తీసుకురావడంపై తనదైన విశ్లేషణ చేస్తున్నారు కొడాలి నాని.

ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి స‌భ అంటూ ఉన్నట్టుండి ర‌జ‌నీకాంత్ ను తెర‌పైకి తీసుకురావ‌డంపై స్పందించిన కొడాలి నాని… ప‌వ‌న్ క‌ల్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేయ‌డానికే ర‌జ‌నీకాంత్ ను చంద్రబాబు తెర‌పైకి తీసుకొచ్చారని అంటున్నారు. చంద్రబాబు రాజ‌కీయాలు ప‌వ‌న్ కు అర్థం కాకపోవచ్చని, ఇదంతా బ్లాక్ మెయిలింగ్ రాజ‌కీయం అని నాని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన వారంతా ఇప్పుడు ఆయ‌న శ‌త‌జ‌యంతి చేస్తున్నారంటూ కొడాలి విరుచుకుప‌డ్డారు.

కొడాలి చెప్పిన బ్లాక్ మెయిల్ రాజకీయ కోణం సంగతి అలా ఉంటే… తాజాగా రజనీకాంత్ ఎంట్రీపై బాబు మెదడులో మరో ప్లాన్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. అవును… బీజేపీతో పొత్తు ప్రయత్నాల్లో భాగంగానే రజనీకాంత్ ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో రజనీకి మాంచి సంబందాలున్నాయి. ఈ క్రమంలో… తమ పాత స్నేహాన్ని ఒకసారి తరపైకి తెచ్చి.. ఫలితంగా బీజేపీతో పొత్తుకు రజనీని వారధిగా చేసుకోవలని బాబు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

దీంతో… ముక్కుపై వేళేసుకుని చూస్తున్న నెటిజన్లు… ఔరా చంద్రబాబు… ఏమి రాజకీయ తెలివితేటలయ్యా సామీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా… తెలుగు రాజకీయ తెరపైకి సడన్ రాజనీకాంత్ రంగ ప్రవేశం కొత్త పరిణామాలకే దారితీసినట్లేనని అంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు ఈ రేంజ్ లో సినీ నటులను తెరపైకి తెచ్చుకుని ప్రచారం చేసుకుంటుంటే.. మాకు స్టార్లు అవసరం లేదు.. ప్రజలు – దేవుడూ చాలంటూ వైకాపా నేతలు చెబుతుండటం గమనార్హం.