తూర్పుగోదావరి జిల్లా, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు శివకోడు గ్రామం ప్రజలు. ఆరేళ్లుగా నెరవేరని వారి ఆకాంక్ష ఎమ్మెల్యే కృషితో సాధ్యమైందని ఎమ్మెల్యేని ఆ గ్రామస్థులు అభినందిస్తున్నారు. ఇంతకీ వారి ఆకాంక్ష ఏమిటి? ఎమ్మెల్యేని ఎందుకు వారంతా అభినందిస్తున్నారు? ఆ గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈ వివరాలు తెలియాలంటే కింద ఉన్న స్టోరీ చదవండి.
శివకోడు గ్రామానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సీతను ఎత్తుకెళ్లిన రావణాసురుడిని రాముడు సంహరించాడు. దీంతో ఆయనకి బ్రహ్మహత్యా పాతుకం చుట్టుకుంది. ఈ పాప పరిహారార్ధం ఆయన కోటిలింగాలను ప్రతిష్టించాలని మహామునులు చెబుతారు. ఆయన ఆ సత్కార్యాన్ని పూనుకుని కోటిలింగాలను ప్రతిష్ఠిస్తూ వస్తుంటారు. ఇది పురాణాల్లో తెలిపిన విషయం. అయితే రాముడు కోటిలింగాలను ప్రతిష్టాపన చేస్తూ శివకోడు గ్రామానికి వచ్చేసరికి కోటిలింగాలు పూర్తయ్యాయని, అందుకే శివకోడు గ్రామానికి శివకోటిగా పేరు వచ్చిందని ఆ ప్రాంత ప్రజల ప్రగాఢ విశ్వాసం.
అయితే కాలక్రమేణా ఆ పేరు శివకోడుగా మారిందని ఆ గ్రామస్థులు చెబుతారు. కాగా శివకోడు గ్రామస్థులు ఆరేళ్ళ నుంచి గ్రామం పేరును శివకోటిగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. రాజోలు ఎమ్మెల్యే చొరవతో గ్రామస్థుల కోరిక నెరవేరింది. శివకోడు గ్రామం పేరు శివకోటిగా మారుస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి నుంచి జిల్లా కలెక్టర్ కు మంగళవారం ఉత్తర్వులు అందాయి. బుధవారం నుండి శివకోడు గ్రామం శివకోటిగా మారింది.
అయితే దీని వెనుక రాజోలు ఎమ్మెల్యే కృషి ఉందని, అందువల్లే నెరవేరిందని సూర్యారావును అభినందిస్తున్నారు గ్రామస్థులు. ఆయన కృషి వల్లే ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న గ్రామ పేరు మార్పు రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు కృషితో ఈనాటికి నెరవేరిందని శివకోడు మాజీ సర్పంచ్ కసుకుర్తి రామకృష్ణ ఆనందం వ్యక్తం చేసారు. ఎంపీటీసీ సభ్యురాలు చాగంటి శిరీష, పందె దుర్గాభవాని, సొసైటీ అధ్యక్షుడు కసుకుర్తి త్రినాధస్వామి, చాగంటిస్వామి, గ్రామశాఖ టిడిపి అధ్యక్షుడు మెరుగుమువ్వల సత్యవరప్రసాద్, ఆరుమల్లి భాను ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేసారు.
