‘నారా లోకేష్’… తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి, దేశంలోనే సీనియర్ పొలిటీషియన్స్ లో ఒకరిగా ఉన్న నారా చంద్రబాబునాయుడి కుమారుడు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించి, తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి ప్రజాసేవలోకి చిన్నవయసులోనే రంగ ప్రవేశం చేసిన వ్యక్తి.
2017లో ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడు చాలామంది ‘ఆటలో అరటిపండు’ అనుకున్నారు.. మరికొంతమంది ‘పప్పు’ అని కామెంట్ చేశారు. కట్ చేస్తే… ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లుగా ఆ వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘నిప్పు’గా మారారు.
సుమారు 44 ఏళ్ల చరిత్ర కలిగిన రాజకీయ పార్టీకి 43 ఏళ్ల వయసులోనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. ఈ విషయంలో నారా లోకేష్.. ‘వన్ ఆఫ్ ది ఆప్షన్ కాదు.. ఓన్లీ ఆప్షన్’ అన్నట్లుగా తనను తాను మలుచుకున్నారని చెప్పొచ్చు. శారీరకంగా, మానసికంగా, సబ్జెక్ట్ పరంగా, ప్రజెంటేషన్ పరంగా తనదైన మార్పును తనకుతాను తెచ్చుకుని.. పార్టీని, రాష్ట్ర రాజకీయాలను ఆవాహనం చేసుకుని దూసుకుపోతున్నారు.
=>> 2014లోనే లోకేష్ టీడీపీ ప్రధాన కార్యదర్శి అయ్యారు.. పొలిట్ బ్యూరోలో సభ్యుడిగానూ ఉన్నారు. అదేముందిలే… తన తాత స్థాపించిన పార్టీ, తన తండ్రి అధినేతగా ఉన్న పార్టీ, అది పెద్ద విషయమా..?
=>> 2017లో మొదటిసారిగా శాసనమండలి సభ్యుడిగా చట్టసభలోకి అడుగుపెట్టారు. అదేముందిలే… వాళ్ల నాన్న ముఖ్యమంత్రి, పార్టీ అధినేత. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవసరం లేకుండానే ఎమ్మెల్సీ అయిపోయారు, అది పెద్ద విషయమా..?
=>> అదే ఏడాది.. ఐటీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు క్యాబినెట్ మంత్రి అయిపోయారు. అదేముందిలే… ఫంక్షన్ పెట్టినవాడు, వండినవాడు, వడ్డించే వాడు మనోడైనప్పుడు ఇది పెద్ద విషయమా..?
=>> 2019 ఎన్నికల్లో అమరావతి రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేశారు. లక్షా మూడువేల పైచిలుకు ఓట్లు తెచ్చుకున్నారు. కానీ.. ఐదు వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు.!
ఆ తర్వాతే మొదలైంది అసలు కథ..!
జనవరి 27, 2023న చిత్తూరు జిల్లా కుప్పంలో “యువగళం – అహంకారంపై యుద్ధానికి సిద్ధం” అంటూ నారా లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టారు. ఆ యాత్ర ప్రారంభమైన కొత్తలో రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఎన్నో విమర్శలు, మరెన్నో వెటకారాలు. లోకేష్ కాళ్లలో ఎలైన ఎమెంట్ ప్రాబ్లం ఉందని.. ఇది జరిగే పని కాదని.. యువగళం పూర్తవ్వదని.. అది సాధ్యం కాదని రకరకాల వ్యక్తిగత దూషణాలు ఎదుర్కొన్నారు.
మాటలు పెరిగే కొద్దీ, వెక్కిరింతలు వెర్రి తలలు వేసే కొద్దీ, అవమానాలు పరిధులు దాటే కొద్దీ లోకేష్ రాటుదేలిపోయారు.. మరింత పంతం పట్టినట్లుగా పగలూ, రాత్రి అనే తేడా లేకుండా తన పాదయాత్రను కొనసాగించారు. ఈ క్రమంలో చాలామంది ఊహించని రీతిలో అన్నట్లుగా.. 11 ఉమ్మడి జిల్లాల్లో, 97 నియోజకవర్గాల్లో, 2,097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు, 3,132 కి.మీ. మేర యాత్ర కొనసాగించారు.
తాను మాటల మనిషిని కాదు.. చేతల మనిషిని.. ‘ఒక్కసారి కమిట్ అయ్యాక నా మాట నేనే వినను’ అన్నట్లుగా యాత్ర ముగించారు. సుమారు 151 స్థానాలతో వైసీపీ రాష్ట్రంలో అత్యంత బలంగా ఉంది.. మరోవైపు కరోనా మహమ్మారితో రాజకీయం స్థబ్ధగా మారిపోయింది.. ఇంకోపక్క కేడర్ కుదేలైపోయిందనే కామెంట్లు, మరోపక్క పార్టీ అధినేత అరెస్టు.. ఈ సమయంలో లోకేష్ తనలోని మరో కోణాన్ని తెరపైకి తెచ్చారు. ఆంధ్ర టు ఢిల్లీ చక్కర్లు కొట్టారు.
కారాగారంలో ఉన్న తన తండ్రిని బయటకు తీసుకొచ్చే పనులు ఓ భుజాన్న… పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపుతూ, నాయకులలో నమ్మకాన్ని సడలించకుండా చూసుకుంటూ, కుటుంబ సభ్యులకు ధైర్యంగా నిలిచే బాద్యతలు మరో భుజాన్న మోసారు.. అన్నింటికీ ఎదురుగా తాను నిలబడ్డారు.. పార్టీని నిలబెట్టారు. టీడీపీ భవిష్యత్తుకు ఢోకా లేదనే సంకేతాలు అటు నాయకులకు, ఇటు కార్యకర్తలకు అత్యంత బలంగా పంపే ప్రయత్నం చేశారు.
కట్ చేస్తే.. ‘న భూతో న భవిష్యతి’ అన్నస్థాయిలో టీడీపీ అధ్వర్యంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. పలు కీలక శాఖలకు నారా లోకేష్ మంత్రిగా ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రి పదవి అంటే కిరీటం కాదు.. బాధ్యత అని గుర్తించి సక్సెస్, ఫెయిల్యూర్ తో పట్టింపు లేకుండా పనిచేసుకుంటూ పోతున్నారు. అయినప్పటికీ పార్టీ కేడర్ లో ఏదో లోటు కనిపిస్తుంది.
‘లోకేష్ కష్టానికి తగిన పదవి పార్టీలో దొరకలేదే’… అనేది సగటు కార్యకర్త అభిప్రాయంగా మారిపోయింది. ‘ఈ యువరాజే, భవిష్యత్ తెలుగు రాజ్యానికి మహారాజు అని.. ఆ పట్టాభిషేకానికి ముందు జరగాల్సిన కార్యక్రమం జరగడం లేదే’ అనే చర్చా జరిగింది. అయితే… ఆ ముహూర్తం రానే వచ్చింది. ఏప్రిల్ 15, 2026 పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు అప్పగిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది.
అంతే… రాష్ట్రవ్యాప్తంగా కేడర్ లో కొత్త సందడి మొదలైంది. క్యాలెండర్ లో కనిపించని ఓ కొత్త పండుగ వారి ఇంట జరిగింది. కేకులు కట్ చేసుకుంటూ, స్వీట్లు తినిపించుకుంటూ, జెండాలు ఎగురేసుకుంటూ, ర్యాలీలు తీస్తూ, అన్నదానాలు – రక్తదానాలు చేస్తూ.. కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. టీడీపీలో నవశకం మొదలైందని నమ్మారు!
ఇంతవరకూ బాగానే ఉంది. కానీ.. ఇప్పుడే లోకేష్ పై వయసుకు, అనుభవానికి మించిన అన్నట్లుగా బాధ్యతలు పెరిగాయి. ఇప్పుడు లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కాదు. కేవలం నారా చంద్రబాబు నాయుడి కుమారుడు కాదు.. ఆయన కేబినెట్ లో ఓ మంత్రి మాత్రమే కాదు. కోట్ల మంది కార్యకర్తలు ఉన్న అతి పెద్ద కుటుంబానికి పెద్ద! ఈ సమయంలో లోకేష్ ఇలా ఉంటే సరిపోతుందా.. ఇంకా ఏమైనా మారాల్సింది ఉందా..?
ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకునే అధికారం, శాసనాలు చేసే శక్తి సీఎం కుమారుడిగా, కేబినెట్ లో కీలక మంత్రిగా లోకేష్ కు ఉన్నాయి. దానికి బోలెడంతమంది ప్రభుత్వాధికారులు ఉంటారు. సలహాదారులూ ఉంటారు. కానీ… పార్టీకి ఇప్పుడు అన్నీ తానై అన్నట్లుగా లోకేష్ నడిపించాలి.
* స్వతాహాగా ఈ వయసులో ఉండే ఆవేశాలకు.. శాంతంతో వ్యూహంతో కూడిన ఆలోచనలు తోడవ్వాలి.
* అధికారం ఉన్నా లేకున్నా కేడర్ కు తానున్నాననే నమ్మకాన్ని కలిగించాలి.
* అధికారంలో ఉంటే పోలీసుల మద్దతు ఉంటుంది.. కార్యకర్తలకు వారి తోడుంటుంది అనుకోవచ్చు.
* అది లేకపోయినా… ప్రతీ కార్యకర్త ధైర్యంగా, నమ్మకంగా, ధీమాగా బ్రతికే భరోసా లోకేష్ కలిగించాలి.
* “అన్నా..” అని పిలిస్తే “నేనున్నా..” అనే అంత అందుబాటులో కేడర్ కు లోకేష్ ఉండాలి.
* దీనికి ఆవేశం కంటే ఆలోచన చాలా ముఖ్యం.. నిబద్ధత, ఖశ్చితత్వంతో కుడిన నిర్ణయాల ఎంపిక మరీ ముఖ్యం అని లోకేష్ గ్రహించాలి.
* ప్రధానంగా… ‘రెడ్ బుక్ రాజ్యాంగం, ఇది సమాజ హితం’ వంటి కామెంట్లు తన స్థాయికి తగవనే విషయాన్ని వీలైనంత త్వరగా గ్రహించాలి.
* ఎందుకంటే.. 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో తన తండ్రి నాలుగోసారి మాత్రమే అంటే సుమారు సగం కాలానికంటే తక్కువే అధికారంలో, అధికారపక్షంలో ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలి.
* అధికారం లేనప్పుడే పార్టీకి నాయకుడి అసలు సిసలు సత్తా తెలుస్తోందని.. అందుకు అధికారంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలే కీలక భూమిక పోషిస్తాయని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.
* అదేవిధంగా… సాధారణంగా రీజనల్ పార్టీలలో ఉండే ‘బాస్ ఆల్ వేస్ కరెక్ట్’ అనే సంస్కృతిని వీలైనంత దూరం పెట్టి.. సీనియర్ల అనుభవాలు, జూనియర్ల కొత్త ఆలోచనలను పరిగణలోకి తీసుకుని ముందుకువెళ్లాలని తెలుసుకోవాలి.
