ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి మరణించే చివరి నిమిషం వరకు కాంగ్రెస్ నేతగానే ఉన్నారు. సొంతంగా పార్టీ పెట్టి ఆ పార్టీని గెలిపించుకునే సత్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే రాజశేఖర్ రెడ్డి ఎంతగానో కష్టపడటం గమనార్హం. అయితే రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్న సమయంలో ఆయన బీజేపీలో చేరాలని అనుకున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
కొంతమంది ఆ ప్రచారాన్ని నిజమని నమ్మితే మరి కొందరు ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని భావిస్తారు. అయితే మాజీ ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒకరోజు రాజారెడ్డి గారు నన్ను ఫోన్ చేసి రమ్మన్నారని కడప ఎంపీ గెస్ట్ హౌస్ కు రావాలని అయన సూచించారని షేక్ హుస్సేన్ తెలిపారు. రాజారెడ్డి గారికి బీజేపీలో చేరాలని ఉండేదని ఈ విషయం గురించి వైఎస్సార్ తో మాట్లాడాలని నాకు రాజారెడ్డి సూచించారని ఆయన చెప్పుకొచ్చారు.
రాజశేఖర్ రెడ్డి గారిని కలిసి రెండు నిమిషాలు మాట్లాడాలని అడగగా అందరినీ వైఎస్సార్ బయటకు పంపారని ఆయన తెలిపారు. బీజేపీలో చేరదామని వైఎస్సార్ తో చెప్పగా వైఎస్సార్ ఫక్కున నవ్వారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పిచ్చి నీకు కూడా పట్టించారా అని ఆయన అన్నారని మనం కాంగ్రెస్ ఇంట్లో ఉన్నామని ఈ ఇంట్లోనే ఉండి పోరాటం చేయాలని వైఎస్సార్ సూచించారని షేక్ హుస్సేన్ వెల్లడించారు.
వాస్తవంగా జరిగింది ఇదేనని పులివెందులలో కూడా ఈ చర్చ జరిగిందని షేక్ హుస్సేన్ తెలిపారు. వైఎస్సార్ ఏరోజు కాంగ్రెస్ ను వదిలిపెట్టి పోవాలని అనుకోలేదని షేక్ హుస్సేన్ కామెంట్లు చేశారు. వైఎస్సార్ మరణించిన తర్వాత రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని ఆయన తెలిపారు. రాజకీయంగా జగన్ ఎదగకూడదని కాంగ్రెస్ కుట్రలు చేయలేదని షేక్ హుస్సేన్ పేర్కొన్నారు.
