ఎంపి కవితకు తెలంగాణ సర్పంచుల మొర

తమ పదవి కాలం పూర్తవుతున్నప్పటికీ గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని సర్పంచ్ లుగానే కొనసాగించాలని జగిత్యాల జిల్లా సర్పంచులు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం జగిత్యాల జిల్లాకు చెందిన సర్పంచులు, ఆ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దురిశెట్టి రాజేష్ నేతృత్వంలో హైదరాబాదుకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా సర్పంచులు ఎంపి కవితకు తమ పరిస్థితిని వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో తొలి సర్పంచ్ లుగా పనిచేసే అవకాశం కలిగినందుకు మాకు ఆనందంగా ఉందని అయితే ఒక ఏడాది పాటు ఉమ్మడి ఏపీలో పనిచేయడం దురదృష్టం గా భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చేస్తున్న కృషి వల్ల సర్పంచులుగా మాకూ ప్రజల్లో ఎనలేని గౌరవం లభిస్తుందని వారు చెప్పారు.  సీఎం కేసీఆర్ ప్రజారంజకమైన పాలనను చూసి ఇతర పార్టీలను వదిలి టిఆర్ఎస్ లో చేరామని కొందరు సర్పంచ్ లు తెలిపారు. మున్సిపాలిటీల్లో విలీనమైన పంచాయతీల నిధులను నిలిపివేశారని, ఇది అభివృద్ధి కి ఆటంకం కలిగిస్తుందని కొందరు సర్పంచులు వివరించారు. ఆ నిధులను విడుదలయ్యేలా చూడాలని వారు కోరారు. సర్పంచ్ ల పదవికాలం ముగుస్తుండటంతో వారి స్థానంలో ప్రత్యేకాధికారులను నియమించడంతో గ్రామాల పరిపాలన అస్తవ్యస్తంగా తయారవుతుందని  సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక గ్రామ కార్యదర్శి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించే వరకు తమనే కొనసాగించాలని సర్పంచ్ లు ఎంపి కవితకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలన్నింటిని సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ కవిత సర్పంచ్ లకు హామినిచ్చారు.