పవన్.. చిరంజీవిని ఫాలో అవ్వాలంటున్న రోజా!

ఆఫ్టర్ స్మాల్ గ్యాప్.. డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ మీడియా ముందుకు వచ్చారు ఏపీ మంత్రి ఆర్కే రోజా. ఇటీవల అనారోగ్యంతో చెన్నైలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న మంత్రి రోజా.. చాలా రోజుల గ్యాప్ తర్వాత మీడియా ముందుకొచ్చారు. వచ్చినవెంటనే జనసేనను టార్గెట్ చేశారు. తనదైన పంచుల వర్షం కురిపిస్తూ… పవన్ కు తనవైన సూచనలు చేశారు.

అవును… చాలా రోజుల గ్యప్ తర్వాత మైకులముందుకు వచ్చిన మంత్రి రోజా… జనసేనాని, జనసైనికులపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. తనకు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో ఉంటే… “రోజా ఇంక నడవలేదు” అంటూ జనసైకోలు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగా… “డెవిల్ ఈజ్ బ్యాక్ మీ అంతు తేల్చేస్తా.. రాసిపెట్టుకోండి” అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

ఇదే క్రమంలో పవన్ పై స్పందించిన రోజా… “ఒక రోజు సీఎం అవ్వాలని అనుకుంటున్నా అంటాడు.. ఇంకోరోజు ఎమ్మెల్యే అయితే చాలంటాడు. అసలు ఎమ్మెల్యే కూడా కాలేనోడు ఎందుకు రోడ్లపై తిరుగుతూన్నాడో అర్థం కావట్లేదు” అంటూ మండిపడ్డారు. స్థిరత్వంలేని మనస్థత్వానికి పవన్ ప్రత్యక్ష ఉదాహరణ అని రోజా వ్యాఖ్యానించారు. పూటకో మాట రోజుకో చేష్ట పవన్ నైజమని ఫైరయ్యారు.

ఇదే సమయంలో తాను గెలిస్తే ప్రజలకు ఏమి చేస్తాననేది చెప్పలేది, ఆ పర్మిషన్ బాబు నుంచి రాక, వైసీపి నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని పవన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రోజా. ఈ సందర్భంగా… పవన్ రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికా లేక వైసీపీ నేతల్ని కొట్టడానికా అని సూటిగా ప్రశ్నించారు.

అనంతరం… పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు చంద్రబాబే స్క్రిప్ట్ ఇస్తున్నారని, కావాలని ఆయన మీడియాలో పవన్ ని హైలెట్ చేస్తున్నారని, పని అయిపోయిన తర్వాత పక్కనపడేస్తారని చెప్పిన రోజా… గతంలో చంద్రబాబు గురించి పవన్ మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకోవాలన్నారు.

ఇదే సమయంలో… చంద్రబాబుని నమ్మొద్దని, చిరంజీవి ఇచ్చిన సలహా పాటించాలని సలహా ఇచ్చారు రోజా. సొంత అన్న చిరంజీవి ఇచ్చిన సలహా పాటిస్తే కనీసం సినిమాల్లో అయినా సక్సెస్ అవుతారని.. అలా కాకుండా చంద్రబాబు వెనకాల తిరిగితే అటు రాజకీయాలకు, ఇటు సినీరంగానికి కాకుండా పోతారని పవన్ కి ఘాటుగా హితవు పలికారు మంత్రి రోజా!