కేటిఆర్ పై ఫైర్ అయిన రేవూరి ప్రకాష్ రెడ్డి

తెలంగాణ మంత్రి కేటిఆర్ పై టిడిపి నేత రేవూరి ప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు.  మొన్న వరంగల్ లో హరీష్ పైన సంచలన  వ్యాఖ్యలు చేసిన రేవూరి నేడు కేటిఆర్ పై విరుచుకుపడ్డారు. తండ్రి కొడుకులిద్దరు కలిసి హరీష్ ను పొమ్మనలేక పొగబెడుతున్నారన్నారు. హరీష్ ను కావాలనే  ఇరకాటంలో పెట్టి నాటకమాడుతున్నారన్నారు. హరీష్ ఖచ్చితంగా తన స్కెచ్ తో ఉన్నాడని, తాను వరంగల్ లో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. 

కేటిఆర్ ముందు ఎదుటి వారి వయసును గౌరవించడం నేర్చుకోవాలన్నారు. చంద్రబాబు పై కేటిఆర్ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్, కేటిఆర్ లు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, తెలంగాణను దోచుకు తింటున్నారన్నారు.

కేసీఆర్ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇళ్లులు, కేజి టూ పిజి విద్య ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న మాట పత్తకు లేకుండా పోయిందన్నారు.

అందరిని మోసం చేసినట్టుగానే హరీష్ రావును కూడా మోసం చేస్తున్నారని, టిఆర్ ఎస్ కోసం తీవ్రంగా శ్రమించిన వ్యక్తి హారీష్ రావన్నారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. హరీష్ రావును తన వారసుడిగా ప్రకటించే దమ్ము దైర్యం ఉందా అని రేవూరి ప్రకాష్ రెడ్డి సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.

కేసీఆర్ తన రాజకీయ వారసుడిగా హరీశ్ రావు పేరును ప్రకటిస్తే తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుంటానని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ రాజ్యాంగేతర శక్తిగా మారారని రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో జోక్యం చేసుకునే అధికారం కేటీఆర్ కు ఎక్కడిదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కేటీఆర్ అమెరికాలో ఉన్నారని గుర్తుచేశారు.