పూర్తి “చంద్ర”ముఖిలా మారుతున్న రజనీకాంత్!

ఎన్ టీఆర్ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో విజయవాడలో జరిగిన సభకు హాజరైనప్పటినుంచీ ఏపీ రాజకీయాల్లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు కూడా తెగ మారుమ్రోగిపోతుంది. నాటి సభలో చంద్రబాబును ఆకాశానికెత్తిన క్రమంలో… రజనీకాంత్ ని వైసీపీ నేతలు ఒక ఆటాడుకున్నారు. ఇక సోషల్ మీడియా జనాలైతే రజనీ గతాన్ని తవ్వి, ఎన్ టీఆర్ వెన్నుపోటులో ఆయన పాత్ర కూడా ఉందని కన్ ఫాం చేసేశారు. ఈ సమయంలో రజనీతో కలిసారు రఘురామకృష్ణంరాజు!

అధికారికంగా టీడీపీ కండువా కప్పుకోకపోయినా… ఒరిజినల్ టీడీపీ నేతలను తలదన్నే స్థాయిలో వైఎస్ జగన్ పై తీవ్రవిమర్శలు చేస్తూ.. చంద్రబాబుని తెగ పొగిడేస్తుంటారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. తాజాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కూడా అంతా తానై చూసుకున్నారనే కామెంట్లు కూడా వినిపించాయి. ఆర్.ఆర్.ఆర్. అతుత్సాహం చూసి టీడీపీ ఎంపీలు సైతం ముఖం చిన్నబుచ్చుకున్నారనే స్థాయిలో కథనాలొచ్చాయి.

ఈ క్రమంలో వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్ లో కూడా రజినీ పాత్ర ఉందని పాత ఫొటోలు కొన్ని వైరల్ అవుతున్న నేపథ్యంలో… ఆయన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుతో కలసి కనపడ్డారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ ఫోటో వైరల్ గా మారింది. దీంతో… గతంలో ఎప్పుడూ చంద్రబాబు కోసం ప్రచారం చేయని రజనీకాంత్ ని… ఈసారి మాత్రం ఫుల్ గా వాడేయబోతున్నారనే సంకేతాలు తెరపైకి రావడం మొదలయ్యాయి.

ప్రస్తుతం రజినీకాంత్ కూడా ఢిల్లీలోనే ఉన్నట్టు తెలుస్తోన్న నేపథ్యంలో… ఆయనతో రఘురామ తీసుకున్న ఫొటోల్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వన్ అండ్ ఓన్లీ తలైవాతో చర్చలు ఇప్పుడే ముగిశాయని కూడా చెప్పారు. అంటే బీజేపీతో పొత్తుకోసం పరితపిస్తున్న చంద్రబాబు కోసం రజినీ కూడా రాయబారం నడుపుతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అంటే… విజయవాడ సభ అనంతరం హస్తినలోకూడా రజనీని చంద్రబాబు & కో ఫుల్ గా వాడేస్తున్నారన్నమాట!

ఏది ఏమైనా… నిన్నమొన్నటివరకూ అందరివాడిగా ఉంటూ, తన దారి రహదారి అని చెప్పుకున్న రజనీకాంత్… ఇప్పుడు తనది సైకిల్ దారని, తాను చంద్రబాబు మనిషిని అని చెప్పుకుంటారనే కామెంట్లు మొదలైపోయాయి. దీంతో… పూర్తి చంద్రముఖిలా మారుతున్న రజనీకాంత్ అనే కామెంట్లకు ఛాన్స్ దొరికింది! మరి ఈ కొత్త బహిరంగ స్నేహం రజనీకెరీర్ లో ఎలాంటి పేరు తీసుకురాబోతుందనేది వేచి చూడాలి!