ఎట్టకేలకు పులివెందుల హైటెక్ బస్టాండ్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బస్టాండ్ని నిర్మించారు. బస్టాండ్ నిర్మాణ సమయంలో రాజకీయంగా చాలా విమర్శలు వచ్చాయి.
కొత్త బస్టాండ్ నిర్మాణం నేపథ్యంలో బస్సుల్ని ప్రయాణీకుల కోసం నిలిపేందుకు చేసిన ఏర్పాట్లు చాలా విమర్శలకు తావిచ్చాయి. తడకలతో అత్యంత దారుణమైన స్థితిలో వుండేది ఆ తాత్కాలిక బస్ స్టాండ్. నిజానికి, కొత్త హైటెక్ బస్టాండ్ నిర్మాణంలో కొంత ఆలస్యం కూడా జరిగింది.
కోవిడ్ సహా అనేక కారణాలతో కొత్త బస్టాండ్ నిర్మాణం ఆలస్యమవడంతో పులివెందుల బస్టాండ్ దుస్థితిపై తీవ్రస్థాయి విమర్శల్ని ఎదుర్కొంది ప్రభుత్వం. ప్రయాణీకులు తీవ్రమైన ఇబ్బందులూ పడ్డారనుకోండి.. అది వేరే సంగతి.
ఎలాగైతేనేం, తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోమన్ రెడ్డి ఆ బస్టాండ్ని ప్రారంభించారు. ఇది విపక్షాలకు చెంపపెట్టు.. అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విపక్షాలపై మండిపడ్డారు. ‘ఇకపై మూడు నెలలకో శంకుస్థాపన కాదు, ప్రారంభోత్సవాలు జరుగుతాయి.. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే పులివెందుల నియోజకవర్గాన్ని ఓ ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తున్నాం..’ అంటూ ముఖ్యమంత్రి తాజాగా ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారులూ ముందు ముందు బాగుపడబోతున్నాయనీ, విపక్షాలు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలనీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన సందర్భంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ వ్యాఖ్యానించారు.
