రాజంపేట పార్లమెంట్ స్థానం పై పట్టు పెంచుకున్న పెద్దిరెడ్డి

(యనమల నాగిరెడ్డి)

కడప- చిత్తూరు జిల్లాల పరిధిలో విస్తరించిన రాజంపేట పార్లమెంటు స్థానంపై వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మాజీ ఎం.పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రోజు రోజుకు తమ పట్టు బిగిస్తున్నారు.  దీని  పర్యవసానాల మీద ఒక విశ్లేషణ.

 

 

నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వైస్సార్ పార్టీ అభ్యర్థి గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 2014లో ఈ నియోజకవర్గం నుండి ఎం.పి.గా గెలిచారు. ఆప్పటి నుంచి పార్టీ ఎం.ఎల్.ఏ లు, అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యులు, ప్రజలతో మంచిసంబందాలు పెట్టుకుని ఆయన, ఆయన తండ్రి రామచంద్రారెడ్డి సంయుక్తంగా కృషి చేస్తూ తమ పట్టు పెంచుకుంటున్నారు.

నియోజకవర్గ చరిత్ర

రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కడప జిల్లాకు చెందిన కోడూరు, రాజంపేట, ఎల్.ఆర్.పల్లి, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, చిత్తూరు జిల్లాకు చెందిన తంబల్లపల్లి, మదనపల్లె, పీలేరు, నియోజకవర్గాలు ఉండేవి.
పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గంలో కడపజిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గానికి మొత్తం 15 సార్లు ఎన్నికలు జరగగా అందులో 11 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ అభ్యర్థులు రెండుసార్లు గెలవగా ఒకసారి స్వతంత్ర పార్టీ అభ్యర్థి, మరోసారి వైస్సార్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు.

కాంగ్రెస్ అభ్యర్థులు టి.ఎన్. విశ్వనాథ రెడ్డి ఒక సారి, పార్థసారథి 4 సార్లు, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడైన అన్నయ్యగారి సాయి ప్రతాప్ 6 ఎన్నికలలో ఎం.పి గా గెలుపొందారు. టీడీపీకి చెందిన పాలకొండ్రాయుడు, గునిపాటి రామయ్య  గెలుపొందారు. 

2014 ఎన్నికల క్యాంపెయిన్ లో పురందేశ్వరి (ఫోటో క్రెడిట్స్ ది హిందూ)

ఈ నియోజకవర్గంలో అధిక శాతం బలిజ కులానికి చెందిన ఓటర్లు ఉన్నారు. కులాల ప్రాతిపదికన ఈ నియోజకవర్గాన్ని రెండు పార్టీలు 2009 వరకు బలిజ కులానికి చెందిన వ్యక్తులకు కేటాయించడం జరిగింది.

2014 ఎన్నికలలో మాత్రం….

2014 ఎన్నికలలో మాత్రమే బలిజ కులానికి చెందిన వారికి టికెట్ ఇవ్వకుండా వేరే కులాల వారికి వైస్సార్ పార్టీ మిథున్ రెడ్డి (రెడ్డి), టీడీపీ తన మిత్రపక్షమైన బీజేపీకి సీటు కేటాయించడంతో బీజేపీ పురంధరేశ్వరి (కమ్మ) కు టికెట్లు ఇవ్వగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం సాయి ప్రతాప్ (బలిజ)కే టిక్కెట్ ఇచ్చింది. 
ఈ ఎన్నికలలో మిథున్ రెడ్డి (601752 ఓట్లు), పురంధేశ్వరి (426990 ఓట్లు), సాయి ప్రతాప్ 29 వేల ఓట్లు సాధించారు. “పొమ్మనలేక పొగ పెట్టిన చందంగా” టీడీపీ బీజేపికి రాజంపేట సీటు కేటాయించడం, విధిలేని స్థితిలో పురంధరేశ్వరి పోటీ చేయడం జరిగింది. ఈ ఎన్నికలలో “ఎలాగూ గెలవలేమనే ఉద్దేశ్యంతో” ఉన్న పురంధరేశ్వరి తన సర్వశక్తులు వినియోగించలేదు. అయినా టీడీపీ, బీజేపీ పొత్తు వల్ల ఆమె 4.26 లక్షల ఓట్లు సాధించగా మిథున్ రెడ్డి 1.64 లక్షల ఓట్లతో ఆమెపై గెలుపొందారు.

అలాగే ఈ ఎం.పి. నియోజకవర్గంలోని 7 శాసనసభ స్థానాలలో 2014 లో కోడూరు, రాయచోటి, మదనపల్లి, పీలేరు, పుంగనూరు స్థానాలు వైస్సార్ గెలవగా, రాజంపేట, తంబల్లపల్లి శాసనసభ స్థానాలలో టీడీపీ గెలిచింది.

ప్రస్తుత పరిస్థితి

ప్రస్తుతం ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా పెద్దిరెడ్డి కుటుంబీకులు తమ పట్టు పెంచుకున్నారని చెప్పవచ్చు. పుంగనూరు, మదనపల్లి, పీలేరు లను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తుండగా, తంబల్లపల్లి నియోజకవర్గాన్ని ఆయన సోదరుడు ద్వారకనాధ రెడ్డి గత నాలుగు సంవత్సరాలు గా అంటిపెట్టుకుని, గ్రామ గ్రామాన పర్యటిస్తూ తన పట్టు పెంచుకుంటూ వచ్చారు.

రాజకీయ జీవిత మంతా కాంగ్రెస్… చివరి దశలో టిడిపిలో చేరిన అనయ్యగారి సాయి ప్రతాప్

కాగా కడప జిల్లాలోని రాయచోటి, రాజంపేట, కోడూరు నియోజకవర్గాలను మిథున్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

అయితే కోడూరులో పార్టీకి ఎం.ఎల్.ఏ. ఉన్నా నియోజకవర్గ భాద్యుడు లేకపోవడం వల్ల వైస్సార్ పార్టీ చుక్కాని లేని నావలా ఉంది. రాజంపేటలో పార్టీ ఫిరాయింపుల వార్తలు టీడీపీ ఓటర్లను సందిగ్ధంలో ఉంచుతున్నాయి. రాయచోటి లో నమ్మకమైన ఓటర్లున్నప్పటికీ నాయకుడిపై ఉన్న అసంతృప్తి వ్యతిరేకంగా ఉంది.

తంబల్లపల్లి లో ద్వారాకనాధ రెడ్డి స్థానికుడు కాకపోవడం, లక్ష్మీదేవమ్మ వర్గం తీసుకునే నిర్ణయం ఇక్కడ ఫలితాలను ప్రభావితం చేయగలవు. మదనపల్లి నియోజకవర్గంలో ఓటర్లు, ఎం.ఎల్.ఏ ఉన్నా నాయకత్వ లోపం కొట్టవచ్చినట్లుంది. రామచంద్రరెడ్డికి రెండు మండలాల్లో పట్టున్నా, పట్టణంలో పార్టీకి సరైన చుక్కాని లేదు. ఇక్కడ టీడీపీ వర్గ పోరు తమకు లాభిస్తుందని వైస్సార్ నాయకులు ఆశిస్తున్నారు. 

పుంగనూరు, పీలేరులలో ఓటర్లతో పాటు పార్టీ నాయకత్వం బలంగా ఉండటం, “ప్రత్యేక హోదా కోసం మిథున్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల వచ్చిన సానుభూతి” , టీడీపీ అభ్యర్థిని నిర్ణయించక పోవడం వల్ల ఉన్న సందిగ్దత తమకు లాభకరమని, అందువల్ల ఈ పార్లమెంటు స్థానంలో తమ గెలుపు ఖాయమని పెద్దిరెడ్డి వర్గం ధీమాగా ఉంది.

టీడీపీ అభ్యర్థి పై వీడని సస్పెన్స్ 

గత ఎన్నికలలో ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. ఎన్నికల తర్వాత పురంధరేశ్వరి ఈ నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగే టీడీపీ కూడా ఇప్పటివరకూ ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదు.

 

కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, రాజంపేట నుంచి పోటీ చేస్తారా?

బీజేపీతో తెగతెంపులు చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ పార్లమెంట్ స్థానానికి మిథున్ రెడ్డికి పోటీగా ధీటైన అభ్యర్థిని రంగంలోకి దించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 
కుల ప్రాతిపదికన అయితే ఎం.ఎల్.సి. చెంగల్రాయలు (కోడూరు), మాజీ ఎం.పి పాలకొండరాయుడు (రాయచోటి)బలమైన అభ్యర్థులుగా ఉంటారు. ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ కేంద్రమంత్రి సాయి ప్రతాప్ వైస్సార్ నీడగా మాత్రమే రాజకీయాలలో ఉన్నారు. ఆయన కానీ, ఆయన అల్లుడు కూడా టీడీపీ టికెట్ రేసులో ఉన్నారట.

కులాల లెక్కలను పక్కన పెడితే టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి అన్ని రకాల బలమైన అభ్యర్థి కాగలడని అధినేతతో పాటు, పార్టీ నాయకుల భావన.
ఏది ఏమైనా ప్రస్తుతానికి ఈ పార్లమెంట్ స్థానం పెద్దిరెడ్డి కుటుంబీకుల పట్టులోనే ఉందని, వైస్సార్ అభ్యర్థి మిథున్ రెడ్డి గెలుపు ఖాయమని పరిశీలకుల అంచనా! వేచిచూద్దాం