ఎటూ తేల్చుకోలేకపోతున్న జనసేనాని.! కానీ, ఎందుకు.?

Pawan Kalyan

2019 ఎన్నికల్లో తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్నదానిపై చివరి నిమిషంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం దారుణంగా జనసేన పార్టీని దెబ్బ తీసింది. ఫక్తు రాజకీయ నాయకుడికీ, సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారికీ ఈ సమస్య వుంటుంది.

చిరంజీవి కూడా రెండు చోట్లా పోటీ చేస్తే ఓ చోట దెబ్బతిన్నారు.. అదీ దెబ్బతిన్న ప్రాంతం తాను పుట్టిపెరిగిన పశ్చమ గోదావరి జిల్లా కావడంతో అప్పటి ప్రజారాజ్యం పార్టీ అధినేత చాలా తీవ్రంగా నిరాశ చెందారు అప్పట్లో. మళ్ళీ అదే పశ్చిమగోదావరి జిల్లా పవన్ కళ్యాణ్ అలాగే నాగబాబునీ ఓడించింది.

దాంతో, తూర్పుగోదావరి జిల్లా వైపు పవన్ దృష్టి సారించారనే ప్రచారం జరుగుతోంది. గాజువాక నుంచీ పవన్ 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో, ఉత్తరాంధ్ర వైపు పవన్ అస్సలు ఆలోచన చేయడంలేదట. తిరుపతి నుంచి పోటీ చేయాలని జనసేనానిపై పార్టీ శ్రేణులు ఒత్తిడి చేస్తున్నాయి.

ఓ డజను వరకు నియోజకవర్గాల్లోని అనుకూల పరిస్థితుల్ని జనసేన ముందుంచిందట పార్టీకి చెందిన కీలక బృందం. అందులో భీమవరం, గాజువాక, తిరుపతి, పాలకొల్లు, కాకినాడ సహా పలు నియోజకవర్గాలు వున్నట్లు తెలుస్తోంది. వీటి విషయమై పవన్ కళ్యాణ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారట.

ఇదిలా వుంటే, నాగబాబు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. చివరి నిమిషంలో తప్పనిసరైతే.? అన్న కోణంలో రెండు మూడు నియోజకవర్గాల్ని ఆయన కోసం ఇప్పటినుంచే ఓ ఐడియాలో పెట్టుకోవాలని భావిస్తోందట జనసేన.