పవన్ కళ్యాణ్ అక్రమ సంబంధాలపై వైఎస్ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు.!

విషయం మరింత వివాదాస్పదమవుతోంది. రాజకీయ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలు హద్దులు మీరుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికారిక బహిరంగ సభల్లో సంయమనం కోల్పోతున్నారు. ఆయన చేస్తున్న అత్యంత దిగజారుడు విమర్శలు, వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

రాజకీయాల్లో విమర్శలు సహజం. ఆ విమర్శల హద్దులు ఎప్పుడో చెరిగిపోయాయ్. నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం సర్వసాధారణమైపోయింది. అయితే, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ‘అక్రమ సంబంధాల గురించి’ మాట్లాడే స్థాయికి దిగజారిపోవడమే అత్యంత హేయం.

వైఎస్ జగన్ ఉద్దేశ్యం ఏదైనా కావొచ్చు. కానీ, ఆయన.. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో, ‘అక్రమ సంబంధాలపై’ మాట్లాడి వుండకూడదు.! వైసీపీలో కింది స్థాయి నాయకులతో, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయిస్తే సరిపోయేదానికి.. ముఖ్యమంత్రి ఎందుకు ప్రతిసారీ అత్యుత్సాహం చూపుతున్నట్టు.?

పవన్ కళ్యాణ్ అలా రెచ్చగొడుతున్నారు.! ఔను, ‘జగన్.. జగ్గూబాయి..’ అంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంయమనం కోల్పోతున్నారు. మౌనంగా వుండాల్సిన పనిలేదు. ‘పెళ్ళాలు.. పెళ్ళిళ్ళు.. అక్రమ సంబంధాలు..’ వీటి గురించి మాట్లాడకుండా, కాస్తంత పద్ధతైన భాషలో ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన హుందాతనమే పెరుగుతుంది.

విపక్షాలు రెచ్చగొడతాయ్.. ముఖ్యమంత్రి రెచ్చిపోకూడదు.! మొత్తమ్మీద, జనసేనాని పవన్ కళ్యాణ్ ట్రాప్‌లో వైఎస్ జగన్ పడిపోయారు.!