చంద్రబాబు ఆఫర్ ను అందుకే వద్దన్నాడా ?

మామూలుగా అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయానికి పెద్దగా హేతువు ఏమీ ఉండదు. ఏదో గాలివాటు లాగే ఉంటుంది పవన్ వ్యవహారమంతా. అలాంటిది రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారంటే వెనుక ఏదో పెద్ద వ్యూహమే దాగుందని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయ్. పొత్తు పెట్టుకుందాం రమ్మని చంద్రబాబునాయుడు బహిరంగంగా ఆహ్వానించినా రాను పొమ్మని పవన్ అన్నారంటే అందుకు పెద్ద కారణమే ఉందని కాపు నేతలు చెబుతున్నారు.

పవన్ ఆలోచనంతా కర్నాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయినట్లుగానే తాను కూడా ఏపికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని పవన్ భావనట. కర్నాటకలో కాంగ్రెస్, బిజెపి, జెడిఎస్ తో పాటు మరికొన్ని చిన్నా చితకా పార్టీలు పోటీ చేశాయి. నెంబర్ గేమ్ లో కాంగ్రెస్, బిజెపిలు కొట్టుకుంటే చివరకు మూడో స్ధానంలో నిలిచిన కుమారస్వామి సిఎం అయ్యారు. కాంగ్రెస్, బిజెపిలు అత్యధిక సీట్లు గెలుచుకున్నా కేవలం 36 సీట్లు గెలుచుకున్న కుమారస్వామే సిఎం అయ్యారు. బిజెపిని అధికారంలోకి రానీయకూడదన్న ఏకైక ధ్యేయంతోనే కాంగ్రెస్ కుమారస్వామికి మద్దతిచ్చి సిఎం కుర్చీలో కూర్చోబెట్టింది.

రేపు ఏపిలో కూడా అటువంటి పరిస్ధితే తలెత్తే అవకాశాలున్నాయని పవన్ అంచనా వేస్తున్నారట. అధికారం కోసం తెలుగుదేశంపార్టీ, వైసిపిలు పోటీ పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. పోటీ తీవ్రంగా ఉండి రేపటి ఎన్నికల్లో చంద్రబాబు, జగన్ దాదాపు సమానంగా సీట్లు సాధిస్తే ఇద్దరిలో ఎవరికీ సిఎం అయ్యే అవకాశాలుండవని పవన్ అంచనా వేస్తున్నారట. మొత్తం 175 సీట్లలో ఎవరు అధికారంలోకి రావాలన్నా కనీసం 88 సీట్లు గెలవాలి.

చంద్రబాబు, జగన్ ఇద్దరిలో ఎవరికీ అన్నీ సీట్లు రావని కాబట్టి కర్నాటకలో లాగ తనకు ఏ 30 సీట్లు వచ్చినా తానే సిఎం అవుతానని పవన్ ఆశతో ఉన్నారట. ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 సీట్లు, ఉత్తరాంధ్రలోని 34 సీట్లు అంటే మొత్తం 68 సీట్లలో కనీసం 30 గెలుచుకున్నా చాలని పవన్ అనుకుంటున్నారట. అందుకనే చంద్రబాబుతో కానీ మరే పార్టీతో కానీ పొత్తుండదని స్పష్టంగా చెప్పారని జనసేన వర్గాలంటున్నాయి. మరి పవన్ అంచనాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సిందే.