మంత్రి అంబటిది వె.ధ.వ. సోది: నాగబాబు

సినీ నటుడు, నిర్మాత, మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు, సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘అన్నయ్య షోకి డుమ్మా.. బాలయ్య షోకి జమ్మ.. రక్త సంబంధం కన్నా ప్యాకేజీ బంధమే గొప్పదా.?’ అంటూ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద ట్వీటేశారు.

గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్‌గా చేసుకుని వైసీపీ నేత అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లేస్తున్నారు. ఈ ట్వీట్లపై పాజిటివ్ రెస్పాన్స్ కంటే నెగెటివ్ రెస్పాన్సే ఎక్కువగా వస్తోంది. అయినాగానీ, అంబటి మాత్రం తగ్గడంలేదు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకిచ్చిన ‘పవన్ కళ్యాణ్‌ని తిట్టే శాఖ’ బాధ్యతల్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించే క్రమంలో, ప్రజల్లో పలచనైపోతున్నారాయన.

నిజానికి.. ఆయన అధికారికంగా పోలవరం ప్రాజెక్టు తదితర జల వనరుల శాఖ వ్యవహారాలు చేసుకోవాలి. కానీ, ఆ శాఖకు సంబంధించిన ఏ విషయమ్మీదా ఆయనకు అవగాహన వుండదు. ఆయనే స్వయంగా తనకు ఆయా అంశాలపై అవగాహన లేదని మీడియా సాక్షిగానే ఒప్పుకున్నారనుకోండి.. అది వేరే సంగతి.

ఇక, అంబటి తాజాగా వేసిన ట్వీటుపై నాగబాబు స్పందించారు. ‘ఏయ్.. ముందెళ్ళి పోలవరం సంగతి చూడవోయ్.. వె.ధ.వ. సోది..’ అంటూ ట్వీటేశారు నాగబాబు. సరే, అంబటి రాంబాబుని విమర్శించడానికి నాగబాబు వేరే రకంగా ట్వీటేసి వుండొచ్చు. కానీ, మంత్రిని పట్టుకుని ‘వె.ధ.వ.’ అనడం మాత్రం సంస్కారం కాదు. అయినా, రాజకీయాల్లో ఇప్పుడు సంస్కారం గురించి మాట్లాడితే అదో బూతు.!