జేసి కన్నా కెసియార్ చాలా బెటర్..ఎందులోనో తెలుసా ?

తెలుగుదేశంపార్టీ ఏ ముహూర్తాన చంద్రబాబునాయుడు చేతికి వచ్చిందో అప్పటి నుండే సిద్ధాంతాలు మారిపోయాయి. కింద పడ్డా తమదే పై చేయిగా ప్రచారం చేసుకోవటం, తాము చేస్తేనే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం క్రింద ప్రచారం చేయటం లాంటివి చాలా చేస్తారు. తాజాగా చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన మాటలపై చంద్రబాబు అండ్ కో కెసియార్ పై ఒకటే మండిపోతున్నారు. మీడియా సమావేశంలో కెసియార్ మాట్లాడుతూ, విధానపరమైన అంశాలపై చాలానే విరుచుకుపడ్డారు. నోటికొచ్చినట్లు మాట్లాడారు. నిజమే చంద్రబాబును ఉద్దేశించి కెసియార్ కొన్ని అభ్యంతరకరమైన కామెంట్లను చేయటం తప్పే.  కెసియార్ మాట్లాడిన అంశాలను వదిలిపెట్టి కామెంట్లపైనే యావత్ టిడిపి నేతలు కెసియార్ పై ఎదురుదాడి చేస్తున్నారు.

 

చంద్రబాబు అండ్ కో ఎప్పుడూ అంతే. ఎదుటి వాళ్ళు మాట్లాడిన అంశాల్లోని వాస్తవాలను వదిలిపెట్టి వాడిన భాషను, పదజాలాన్ని మాత్రమే పట్టుకుని నానా యాగీ చేయటం అలవాటే. అయితే, చంద్రబాబు అండ్ కో ఇక్కడే ఓ విషయాన్ని మరచిపోయినట్లు నటిస్తున్నారు. అదేమిటంటే, అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి కూడా ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన అంతకన్నా ఎక్కువ స్ధాయిలోనే మాట్లాడుతున్నారు. గడచిన నాలుగేళ్ళుగా జగన్ ను ఉద్దేశించి జేసి ఎంత అసహ్యంగా, అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారో అందరూ వింటున్నదే.

 

మొన్నటికి మొన్న అనంతపురంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో జేసి మాట్లాడుతూ, జగన్ గురించి రాయటానికి కూడా వీల్లేనంత అసహ్యంగా మాట్లాడారు. ఆ మాటలను సాక్ష్యాత్తు చంద్రబాబు వేదిక మీద కూర్చుని చాలా ఆనందించారు. జగన్ ను జేసి తిడుతున్నంత సేపు చంద్రబాబు ముసి ముసి నవ్వులు నవ్వుతునే ఉన్నారు. ఆ విషయాలను అందరూ చూసిందే. జగన్ ను జేసి తిట్టిన తిట్ల ముందు చంద్రబాబుపై కెసియార్ చేసిన కామెంట్లు ఎక్కువేమీ కాదన్న విషయం అందరికీ తెలుసు. అయినా సరే కెసియార్ పైనే చంద్రబాబు అండ్ కో విరుచుకుపడుతుండటం విచిత్రంగా ఉంది.