బీజేపీ , తెలుగు దేశం బలపడకుండా కేసీఆర్ , జగన్ వ్యూహం ?

బీజేపీ , తెలుగు దేశం బలపడకుండా కేసీఆర్ , జగన్ వ్యూహం ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేద్దామని పావులు కదుపుతున్న కమలనాధులతో కలసి పోరాటం చేద్దామని , వారికి అవకాశం ఇవ్వకుండా మనం కూడా సమైక్యంగా ఉందామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు , ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై .ఎస్ . జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తుంది . గురువారం నాడు ప్రగతి భవన్ లో చంద్ర శేఖర్ రావు , జగన్ మోహన్ రెడ్డి మధ్య మూడు గంటలపాటు సమావేశం జరిగింది . ఇందులో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ విస్తరించాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది . మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది . కేసీఆర్ కూతురు కవిత , మేనల్లుడు వినోద్ కుమార్ ఓడిపోయారు . దీంతో కేసీఆర్ జాగ్రత్త పడటం మొదలు పెట్టాడు 

ఆంధ్ర ప్రదేశ్ లో మొదట వైసీపీ తో సామరస్యంగా వున్న భారతీయ జనతా పార్టీ క్రమంగా రాజకీయంగా ఎత్తులు వేయడం మొదలు పెట్టింది . తెలుగు దేశం కాంగ్రెస్ పార్టీల నుంచి అభ్యర్థులు బీజేపీలో చేరడం మొదలు పెట్టారు . తెలుగు దేశం పార్టీ నుంచి నలుగురు రాజ్య సభ సభ్యులు బీజేపీ లో చేరిన నాటి నుంచి ఆపార్టీ వలసలను ప్రోత్సహిస్తుంది . గురువారం కూడా కొంతమంది రాజకీయ నాయకులు బీజేపీలో చేరారు . ఈ పరిణామం తో జగన్ మోహన్ రెడ్డి కూడా జాగ్రత్త పడాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో చంద్ర శేఖర రావు , జగన్ మోహన్ రెడ్డి మధ్య సామావేశం జరిగింది .

గోదావరి నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకుందామని ఇద్దరు నేతలు ఇప్పటికే అంగీకారానికి వచ్చారు . వరంగల్ దగ్గర రాంపూర్ లో గొదావరి ప్రవాహ ఉదృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి నీటిని మళ్లించుకుందామని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది . ఇక ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా వున్న సమస్యలు ఇద్దరు ముఖ్యమంత్రులు కలసి పరిష్కరించుకుందామని , అలా కాకుండా కేంద్రానికి పెత్తనం ఇస్తే రెండు రాష్ట్రాల్లో బలపడే అవకాశం ఉందని వీరు భావించినట్టు తెలిసింది . ఇప్పటికే విభజన 40 సంస్థల విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది . మరో 51 సంస్థలపై చర్చల ద్వారా పరిష్కరించు కుందామని కేసీఆర్ ,జగన్ ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చారట .

ఇక రెండు రాష్ట్రాలకు కామన్ శత్రువుగా వున్న చంద్ర బాబుపై కూడా వీరు చర్చినట్టు తెలుస్తుంది . మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్ర బాబు నాయుడును ఓడించడానికి చంద్ర శేఖర్ రావు అన్నివిధాలా జగన్ కు సహాయం చేసిన సంగతి తెలిసిందే . చంద్ర బాబు నాయుడును అటు ఆంధ్ర ప్రదేశ్లో ,ఇటు తెలంగాణాలో ఏకాకిని చెయ్యాలని , ఇక రాజకీయంగా ఎదగనీయకూడదని వీరిద్దరూ నిర్ణయించుకున్నారట . శాసన సభలోను , బయట చంద్ర బాబు ప్రవర్తన ను జగన్ వివరించగా , మన మధ్య చిచ్చు పెట్టాలని బాబు ప్రయత్నిస్తున్నాడని , అందుకే జాగ్రత్తగా వుండాలని కేసీఆర్ పేర్కొన్నాడట . చంద్ర శేఖర్ రావు , జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు నేతలు . అటు బీజేపీ , ఇటు తెలుగు దేశం విషయంలో స్నేహాంగా ఉంటూ , సమైక్యంగా వారిని ఎదుర్కోవాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది . సామావేశం అనంతరం జగన్ మోహన్ రెడ్డి టీమ్ కు చంద్ర శేఖర్ రావు మంచి విందు భోజనం ఏర్పాటు చేశారట .