TTD Chairman BR Naidu: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హిందుత్వం గురించి గానీ, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి గురించి గానీ మాట్లాడే కనీస నైతిక అర్హత జగన్కు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో జగన్ను ఉద్దేశించి బీఆర్ నాయుడు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఘాటు ప్రశ్నలు సంధించారు.
CM Chandrababu To Visit Delhi: మరోసారి హస్తినకు ముఖ్యమంత్రి చంద్రబాబు: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు!
“హిందుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు జగన్. అసలు దేవదేవుడి పేరును ఉచ్ఛరించే నైతికత నీకు ఉందా?” అని బీఆర్ నాయుడు ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన అండ చూసుకునే వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి వంటి వారు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ఆరోపించారు. ఒక పథకం ప్రకారం తిరుమల కొండపై అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించారని ఆయన మండిపడ్డారు.

అన్యమతస్తుడైన జగన్, శ్రీవారిపై తనకు విశ్వాసం ఉందని ఇప్పటివరకు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదని బీఆర్ నాయుడు నిలదీశారు. ముఖ్యంగా గతంలో ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే సమయంలో తన భార్యతో కలిసి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
“నీ జీవితంలో నీ భార్యతో కలిసి తిరుమలకు రాలేవు.. ఎందుకంటే మీ ఇద్దరూ నమ్మేది ఏసుప్రభువునే కానీ, శ్రీ వేంకటేశ్వర స్వామిని కాదు. ఇది నిజం.. దీన్ని ఒప్పుకో జగన్!” అని ఆయన సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ప్రస్తుతం టీటీడీలో ప్రక్షాళన జరుగుతోందని బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీలో అన్యమతస్తులు ఉండకూడదని తాను తీసుకున్న నిర్ణయం పట్ల జగన్ అండ్ కో కుట్రలు మొదలుపెట్టిందని ఆరోపించారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయనే భయం జగన్లో మొదలైందని ఆయన ఎద్దేవా చేశారు.
తన ప్రతిష్ఠను, తిరుమల గౌరవాన్ని దెబ్బతీయడానికి జగన్ వర్గీయులే డీప్ ఫేక్ వీడియోలు సృష్టించారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారిని ఇంటిదైవంగా పూజిస్తారని, ఆయన ఎప్పుడూ తన భార్యతో కలిసి వచ్చి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారని గుర్తుచేశారు. “నువ్వు నిజంగా హిందువువే అయితే, నీ భార్యతో కలిసి తిరుమలకు రా.. అప్పుడే నిన్ను ఎవరైనా నమ్ముతారు. కానీ నువ్వు సతీసమేతంగా రాలేవు.. నిన్ను ఎవరూ నమ్మరు” అంటూ బీఆర్ నాయుడు తన ట్వీట్లో నిప్పులు చెరిగారు.
ప్రస్తుతం బీఆర్ నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు భక్తుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

