2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం గంపగుత్తగా వైసీపీ వైపు నిలిచిందా.? అంటే, అది పూర్తిగా నిజం కాదు. కొంత ఓటు బ్యాంకు వైసీపీ వైపు, కొంత ఓటు బ్యాంకు టీడీపీ వైపు, మరికొంత ఓటు బ్యాంకు జనసేన వైపు వెళ్ళింది. మొత్తం కాపు ఓటు బ్యాంకులో మెజార్టీ ఓటు బ్యాంకు మాత్రం వైసీపీతోనే వుందప్పుడు.
కారనాలేవైతేనేం, ఇటీవలి కాలంలో రాజకీయాలు చాలా మారాయి. కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం.. అనే నినాదం తెరపైకొచ్చింది. ‘ఎవరైనాసరే, కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి పదవికి పోటీ చేస్తే, వారికే పూర్తిగా మద్దతిస్తాం..’ అని కాపు సామాజిక వర్గ పెద్దలు కొందరు నినదిస్తున్నారు.
మరి, కింది స్థాయిలో కాపు సామాజిక వర్గం ఏమనుకుంటోంది.? ఆ ఓటు బ్యాంకు విషయమై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతల్లో వున్న ఆలోచన, అవగాహన ఏంటి.?
నిజానికి, ఏ సామాజిక వర్గమూ ఏ పార్టీకీ పూర్తిస్థాయిలో అండగా నిలవదు. చెప్పుకోవడానికే కమ్మ పార్టీ, రెడ్డి పార్టీ, కాపు పార్టీ. బీసీ, ఎస్సీ, ఎస్టీ.. ఇలా చాలా లెక్కలుంటాయ్. ఎన్నిలకొచ్చేసరికి, అన్ని సామాజిక వర్గాలూ.. సామాజిక వర్గాలకతీతంగానే ఆలోచిస్తాయ్.
ఆపై కొన్ని ఓట్లు కరెన్సీకి అమ్ముడు పోవడం.. కుల, మత ప్రాంత అభిమానంతో కొన్ని ఓట్లు చీలిపోవడం.. ఇదంతా వేరే కథ. అయితే, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ లోని కాపు నేతలపై వైఎస్ జగన్ ఓ కన్నేసినట్లు చెబుతున్నారు. చంద్రబాబుదీ ఇదే పరిస్థితి.
కాపు సామాజిక వర్గ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడిని అయితే వివిధ పార్టీల్లోని కాపు నేతలు తట్టుకోలేకపోతున్నారు. సంక్రాంతి కోడి పందాల నేపథ్యంలో ఈక్వేషన్స్ అనూహ్యంగా మారిపోతాయన్నది ఓ అంచనా. మెజార్టీ కాపు నేతలు జనసేనలోకి దూకాల్సిందే.. తప్పదు.. అన్నట్టుంది పరిస్థితి.
