తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాలకృష్ణ అసలు ఎన్టీఆర్ వారసుడే కాదని, ఆయన నారా వారి వారసుడని మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్పై బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ చేసిన విమర్శలకు స్పందనగా వైసీపీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు.
గుంటూరు జిల్లా జైల్లో ఉన్న సోషల్ మీడియా కార్యకర్త తారక్ ప్రతాపరెడ్డిని పరామర్శించిన అనంతరం జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు. “పవిత్ర దేవాలయం లాంటి అసెంబ్లీలోకి మ్యాన్షన్ హౌస్ తీసుకురావచ్చా?” అని ప్రశ్నిస్తూ బాలకృష్ణ తీరుపై మండిపడ్డారు. బాలకృష్ణ నిజంగా నందమూరి వారసుడైతే, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉండాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఆ పార్టీకి అధ్యక్షుడు కాబట్టి, బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడు కాదని, ఎప్పుడో చంద్రబాబుకు తొత్తుగా మారిపోయారని ఆయన విమర్శించారు.
‘ఆ సైకోను ఎవరూ గట్టిగా అడగలేదు’: అసెంబ్లీలో జగన్పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. చిరంజీవి వ్యవహారంపై ఘాటు చర్చ
“మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంది బాలకృష్ణే: జూపూడి ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు”
కూటమి ప్రభుత్వం ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తోందని జోగి రమేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కొరతపై పోస్ట్ పెట్టినందుకే సోషల్ మీడియా కార్యకర్త తారక్ ప్రతాపరెడ్డిని అరెస్ట్ చేశారని, ఇది ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని అన్నారు. జగన్ హయాంలో ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను కూడా ఈ ప్రభుత్వం అమ్మేయాలని చూస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదే సందర్భంగా మాట్లాడిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని, కూటమి ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. “ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలన్నీ డిజిటల్ బుక్ లో నమోదు చేస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చాక, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోం” అని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జోగి రమేశ్ తో పాటు గుంటూరు వైసీపీ నేత నూరి ఫాతిమా కూడా పాల్గొన్నారు.

