జ‌న‌సేనకు గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ స‌ర్కార్‌!

మరి కొన్ని గంట‌ల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వారాహి యాత్ర ప్రారంభం కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో పోలీసుల అనుమ‌తి లేక‌పోవ‌డంపై జ‌న‌సేన‌లో టెన్షన్ నెల‌కుంది. దీంతో వారాహి యాత్ర మొదలయిన రోజే ర‌చ్చకు దారి తీస్తుంద‌నే ఆందోళ‌న మొదలైంది. ఈ నేప‌థ్యంలో వారాహి యాత్రపై జ‌న‌సేన నేతల టెన్షన్ ను జ‌గ‌న్ స‌ర్కార్ పోగొట్టింది. వారాహి యాత్రకు అనుమ‌తి ఇస్తున్నట్టు కాకినాడ ఎస్పీ స‌తీష్‌ కుమార్ ప్రక‌టించారు.

అవును… వారాహి యాత్రను అడ్డుకునేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ కుట్రకు తెర‌లేపిందంటూ జ‌న‌సేన నేత‌లు విమ‌ర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. మరికొంతమంది అయితే పవన్ రోడ్లపైకి వస్తుంటే సీఎం జగన్ వణికిపోతున్నారంటూ అతి వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఈ విషయాలపై స్పందించిన వైసీపీ నేతలు… అస‌లు త‌మ‌కు ప‌వ‌న్ యాత్రల్ని అడ్డుకునే ఉద్దేశ‌మే లేద‌ని, పవన్ పాలిటిక్స్ కి భయపడిపోయే స్థితిలో వైసీపీ లేదని స్పష్టం చేశారు.

ఈలోపు జనసేన అధినేత పవన్ నిర్వహించే బహిరంగ సభల స్థలాలను స్థానిక డీఎస్పీలు పరిశీలించారు. అనంతరం మినిట్ టు మినిట్ ప‌వ‌న్ వారాహి యాత్ర షెడ్యూల్ ఇవ్వాల‌ని జ‌న‌సేన నేత‌ల్ని అడిగారు. దీంతో తాజాగా కాకినాడ ఎస్పీ కోరిన‌ట్టుగానే వారాహి యాత్రకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ ను పోలీస్ అధికారుల‌కు జ‌న‌సేన నేత‌లు ఇచ్చారు. దీంతో యాత్రకు పూర్తి అనుమ‌తి ల‌భించింది.

ఈ సంద‌ర్భంగా స్పందించిన కాకినాడ ఎస్పీ… చ‌ట్టానికి లోబ‌డి ఎవ‌రైనా యాత్రలు చేసుకోవ‌చ్చని తెలిపారు. భ‌ద్రతా కార‌ణాల‌ను దృష్టిలో పెట్టుకుని యాత్రకు సంబంధించి పూర్తి వివ‌రాలు అడిగామ‌ని.. ప‌వ‌న్ ప‌ర్యట‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ఎస్పీ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ప్రతీ నియోజకవర్గంలోనూ జ‌న‌సేన నాయ‌కులు త‌మ డీఎస్పీల‌తో ఎక్కడికక్కడ్ద ట‌చ్‌ లో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు.

ఇక జ‌న‌సేన నాయ‌కులు, ప‌వ‌న్ కల్యాణ్ అభిమానులు శాంతిభ‌ద్రత‌ల‌కు విఘాతం క‌లిగించ‌కుండా వారాహి యాత్ర నిర్వహించాల‌ని ఎస్పీ సూచించారు.

కాగా, రేపటి నుంచి పవన్ వారాహి యాత్ర అన్నవరం టు భీమవరం ప్రారంభమవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలి సభను ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో నిర్వహిస్తారు.