ఏపీలో టీడీపీ నేతలపై ఐటి దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ ఈ ఐటి దాడులు టిడిపి నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వరుసగా టిడిపి నేతలనే టార్గెట్ చేస్తూ ఈ ఐటి దాడులు జరగడం పలు చర్చలకు తావిస్తోంది. కాగా ఈ వ్యవహారాన్ని బీజేపీ కక్ష సాధింపు చర్యగా టిడిపి నేతలు సమర్ధించుకుంటుంటే… విపక్షాలు మాత్రం నిప్పు లేనిదే పొగ రాదంటూ దుయ్యబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ ఇంటిపైనా ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు.

ఐటి అధికారులు సుమారు మూడు గంటలపాటు శ్రీధర్ ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరిపారు. పలు కీలేక డాక్యుమెంట్లను, హార్డ్ డిస్కులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దాడుల విషయం బయటకు తెలియకుండా ద్విచక్ర వాహనాలపై వచ్చారు అధికారులు. సోదాలు నిర్వహిస్తున్న విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కేఎంకె ఈవెంట్స్ సంస్థ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు శ్రీధర్ భార్య.
కృష్ణ పుష్కరాల సందర్భంగా దానికి సంబంధించిన పనులకు గానూ ఈ సంస్థ చాలా కాంట్రాక్టులు చేజిక్కించుకుంది. భారీ మొత్తంలో లాభాలు వస్తున్నా వాటిని బయటకు చూపించకుండా పన్నులు ఎగనామం పెడుతున్నారని ప్రధానంగా వచ్చిన ఆరోపణ. ఇటీవల కోనేరు శ్రీధర్ అక్రమ వ్యవహారాలు ఎక్కువయ్యాయని సొంత పార్టీ కార్పొరేటర్ల నుండే వస్తున్న ఆరోపణలు. ఈ క్రమంలోనే ఐటి దాడులు జరిగినట్టు తెలుస్తోంది. కాగా లెక్కల్లో అవకతవకలు ఉన్నట్టు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.
