వైసీపీకి ‘జై’ కొట్టేద్దాం.! జనసేనలో కొత్త ఆశలు.!

మొత్తంగా 20 అసెంబ్లీ నియోజకవర్గాల్ని గెలిపించి ఇస్తామంటూ జనసేన పార్టీ ముందర అధికార వైసీపీ ఓ ప్రతిపాదన వుంచిందట. అది కూడా, జనసేన మిత్ర పక్షం బీజేపీ ద్వారా డీల్ సెట్ చేయడానికి వైసీపీ అధినాయకత్వం సన్నాహాలు చేస్తోందిట. వినడానికే హాస్యాస్పదంగా వుందీ అంశం. కానీ, టీడీపీ అను‘కుల’ మీడియా, ఈ అంశాన్ని విపరీతంగా హైలైట్ చేస్తోంది. మొన్నేమో, టీడీపీతో కలకుండా వుండేందుకోసం బీఆర్ఎస్ అధినేత కేసీయార్, జనసేనాని పవన్ కళ్యాణ్‌కి వెయ్యి కోట్ల ఆఫర్ ఇచ్చారంటూ ఇదే టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారానికి తెరలేపిన సంగతి తెలిసిందే.

వెయ్యి కోట్ల డీల్ కంటే, 20 అసెంబ్లీ స్థానాలు గెలిపించి ఇస్తామంటున్న వైసీపీ డీల్ విషయమై జనసేనాని సీరియస్‌గా సానుకూలమైన నిర్ణయం తీసుకుంటే బావుంటుందన్న అభిప్రాయం కొందరు జనసేన మద్దతుదారుల్లో వ్యక్తమవుతోంది. ‘రాష్ట్ర రాజకీయాల్ని మార్చలేం. అప్పుల కుప్పలా మారిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చినా చేసేదేం లేదు. అధికారంలోకి రావడం కూడా అంత తేలిక కాదు.. ఈ పరిస్థితుల్లో ఎన్నోకొన్ని సీట్లు కష్టం లేకుండా గెలిచేసి, ఎంచక్కా సినిమాలు చేసుకుంటే మంచిది..’ అని జనసేనానికి కొందరు నెటిజన్లు ఉచిత సలహా ఇస్తున్నారు.

నిజానికి, ఇది చాలా మంచి డీల్. తెలిసో తెలియకో.. టీడీపీ అను‘కుల’ మీడియా, జనసేనానికి చెడు చేసే క్రమంలో, మంచి చేస్తున్నట్లే కనిపిస్తోంది. కానీ, వైసీపీ అంటే, నిలువెల్లా కంపరంతో వ్యవహరించే జనసేనాని, ఈ డీల్ నిజంగా తన ముందుకు వచ్చినా ఒప్పుకుంటారా.?